- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
'గ్రామాల్లోనూ బీజేపీ ఉందని రుజువైంది'

దిశ, తెలంగాణ బ్యూరో: మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోనూ బీజేపీ ఉందనే విషయం మునుగోడు ఉప ఎన్నికతో రుజువైందని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నికల్లో సాధ్యమైనంత ప్రచారం చేశామని ఆయన వాపోయారు. ఓటమిపై తమకు నిరాశ లేదని తెలిపారు. శివన్నగూడెం రిజర్వాయర్ వల్ల ఊర్లు మునిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. వాస్తవానికి 5 వారాల కింద ఇక్కడ ఒక్క ఓటు టీఆరెస్ కి పడదన్నారని, కానీ అక్కడ కూడా టీఆర్ఎస్ ఆధిక్యాన్ని కనబరిచిందన్నారు. దీనికి టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు భయభ్రాంతులకు గురిచేయడమే కారణమని విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు, చేనేత జీఎస్టీ,పెట్రోల్ ధరల పెరుగుదల, ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామా టీఆర్ఎస్ కి కలిసొచ్చాయని ఆయన వాపోయారు. కాళేశ్వరం, లిక్కర్ స్కాంలను మాత్రం దాచిపెట్టారని విమర్శలు చేశారు. అంత చేసినా వారు గెలిచింది కేవలం 4 శాతం ఓట్ల తేడాతో మాత్రమేనని ఎద్దేవాచేశారు. నల్లగొండలో బలహీనంగా ఉన్నా టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చామని తెలిపారు. టీఆర్ఎస్ కనీసం ఇప్పటికైనా నల్లగొండ జిల్లాను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చాలని పట్టుబట్టారు. కొన్ని గ్రామాల్లో 15 రోజుల్లో మిషన్ భగీరథ ద్వారా నీళ్లు ఇస్తామన్నారని వారికి ఇవ్వాల్సిందేనన్నారు. బీజేపీ నేతలను ఎవరూ కొనలేరని తెలిపారు. వచ్చే ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నట్లుగా చెప్పారు.
మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ.. మునుగోడు టీఆర్ఎస్ ఎన్నికల బడ్జెట్ రూ.500 కోట్లకు చేరిందని ఆరోపించారు. కేవలం 4 శాతం ఆధిక్యం కోసం రూ.500 కోట్లు ఖర్చు పెట్టారని ఎద్దేవాచేశారు. రూ.300 కోట్ల మద్యం అమ్మకం మునుగోడులో జరిగిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ అంతర్గత గొడవలు, కోవర్టు రాజకీయాలతో టీఆర్ఎస్ ను ఎదుర్కోవడం సాధ్యం కాదని, ఈ బైపోల్ తో టీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం బీజేపీయే అనేది తేలిపోయిందని వెల్లడించారు. ఈ ఎన్నికల స్ఫూర్తితో 2023 సాధారణ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేస్తామని బూర నర్సయ్య గౌడ్ ధీమా వ్యక్తంచేశారు. సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ విజయానికి కారణాలైతే మునుగోడులో 20 వేల మంది కార్యకర్తలను ఎందుకు పెట్టినట్లు అని బూర ప్రశ్నించారు. టీఆర్ఎస్ కు స్ఫూర్తిదాత రాయల్ స్టాగ్, బ్లెండర్స్ ప్రైడ్ అని బూర ఎద్దేవ చేశారు. ఇంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వచ్చినా ప్రజలు టీఆర్ఎస్ ను నమ్మలేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఒక్కో నియోజకవర్గ అభివృద్ధికి రూ.500 కోట్లు విడుదల చేయాలని బూర నర్సయ్య గౌడ్ డిమాండ్ చేశారు. లేదంటే అన్ని నియోజకవర్గల్లో ఎమ్మెల్యేలు అభివృద్ధి కోసం రాజీనామా చేయాలని ఒత్తిడి చేస్తామని హెచ్చరించారు. తాము రాజకీయాల్లోకి వచ్చింది పదవుల కోసం కాదని, ప్రజాసేవ కోసమని చెప్పుకొచ్చారు. రాజకీయ వెట్టిని అంతం చేయగల శక్తి కేవలం బీజేపీకే ఉందన్నారు. ప్రజాస్వామిక వాదులు బీజేపీతో కలిసి రావాలని బూర విజ్ఞప్తిచేశారు.