రోజువారీ కూలీగా మారిన పద్మశ్రీ అవార్డ్ గ్రహీత మొగులయ్య.. కేటీఆర్ కీలక హామీ..!

by Disha Web Desk 19 |
రోజువారీ కూలీగా మారిన పద్మశ్రీ అవార్డ్ గ్రహీత మొగులయ్య.. కేటీఆర్ కీలక హామీ..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్థిక ఇబ్బందులతో పద్మశ్రీ అవార్డ్ గ్రహీత, ప్రముఖ జానపద కళాకారుడు మొగులయ్య రోజువారీ కూలీగా మారారు. ప్రభుత్వం నెలనెలా ఇచ్చే రూ.10 వేల పింఛన్ ఆగిపోవడం, గత ప్రభుత్వం ఇచ్చిన కోటి రూపాయలతో తన పిల్లల వివాహాలు చేయడంతో పాటు, హైదరాబాద్ సమీపంలో ఉన్న తుర్కాయాంజల్‌‌లో ఓ ప్లాట్ కొని ఇల్లు కట్టడంతో డబ్బులు అన్నీ ఖర్చు అయిపోయాయి. దీంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోన్న మొగులయ్య రోజువారీ కూలిగా మారి పనులకు వెళ్తున్నారు. తాజాగా మొగులయ్య సాధారణ కూలీగా పని చేస్తోన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

తన టాలెంట్‌తో దేశ అత్యున్నత అవార్డుల్లో ఒకటైన పద్మశ్రీ అవార్డ్ గెల్చుకున్న మొగులయ్య రోజు వారి కూలీగా మారడం చూసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ చెలించిపోయారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మొగులయ్యకు కేటీఆర్ కీలక హామీ ఇచ్చారు. ‘‘మొగులయ్య కుటుంబాన్ని నేను వ్యక్తిగతంగా ఆదుకుంటాను. నా కార్యాలయ సిబ్బంది వెంటనే మొగులయ్య వద్దకు వెళ్తారు’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. మొగులయ్య రోజు వారీ కూలీగా మారిన విషయాన్ని తన దృష్టికి తెచ్చిన నెటిజన్‌కు ధన్యవాదాలు తెలిపారు.

Next Story

Most Viewed