టీఆర్ఎస్ పాలనపై మూడో ఛార్జ్​షీట్.. కాంగ్రెస్ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

by Dishafeatures2 |
టీఆర్ఎస్ పాలనపై మూడో ఛార్జ్​షీట్.. కాంగ్రెస్ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్​ఎస్​ పాలనపై కాంగ్రెస్​ మూడో ఛార్జ్​షీట్ ను రిలీజ్​ చేసింది. 20 అంశాలతో వ్యవసాయ రంగంలోని సమస్యలను ప్రస్తావిస్తూ విడుదల చేసింది. ఈ మేరకు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్​ఛార్జ్​షీట్​ను గాంధీభవన్​లో ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రైతులకు సబ్సిడీలు ఇవ్వడం లేదన్నారు. రైతు బంధు తో దగా చేస్తున్నారన్నారు. రుణమాఫీ హామీని కూడా మరిచిపోయారన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంతో రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉన్నదన్నారు. రుణమాఫీ చేయకపోవడంతో కొత్త రుణాలు కూడా పుట్టక రైతులు అవస్థలు పడుతున్నట్లు వివరించారు. ఇక కౌలు రైతుల పరిస్థితి అద్వాన్నంగా మారిందన్నారు.గత ఏడాది ఏకంగా వెయ్యి మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు వివరించారు. రైతుల ఆత్మహత్యలను అపహాస్యం చేసిన మంత్రి నిరంజన్ రెడ్డికి ఆ స్థానంలో కొనసాగే అర్హత లేదని తేల్చి చెప్పారు. రైతు బంధు కేవలం భూస్వాములకే మేలు చేస్తుందన్నారు.

ఏఐసీసీ సభ్యులు పాల్వాయి స్రవంతి మాట్లాడుతూ..ఆత్మహత్య చేసుకుంటున్న వారిలో 70 శాతం కౌలు రైతులే అన్నారు.నకిలీ విత్తనాల వల్ల ఏటా15 లక్షల ఎకరాల పంట నష్టం వస్తోన్నా, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. వరివేస్తే ఉరి అని రైతులను సాగుకు దూరం చేశారన్నారు. పెరిగిన ఖర్చులకి అనుగుణంగా మద్దతు ధర పెంచడం లేదన్నారు.పంట బీమా లేని రాష్ట్రంగా చేసిన పాపం కేసీఆర్ దే అని విమర్శించారు. జార్ఖండ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో సొంతంగా పంట బీమాను ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. తెలంగాణ వస్తే రైతుల ఆత్మహత్యలు ఉండవని చెప్పిన టీఆర్​ఎస్ ప్రభుత్వం లో 2014 నుంచి 2020 వరకు రాష్ట్రంలో 6121 మంది రైతుల ఆత్మహత్యలు చేసుకున్నట్లు చెప్పారు.


Next Story