ప్రభుత్వ లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలి.. కలెక్టర్లను ఆదేశించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

by Disha Web Desk 13 |
ప్రభుత్వ లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలి.. కలెక్టర్లను ఆదేశించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం కంటి వెలుగు, డబుల్ బెడ్రూం, జీఓ 58, 59, 76 ప్రకారం క్రమబద్దీకరణ, ఆయిల్ పామ్ సాగుపై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జీవో 58 సంబంధించి క్షేత్రస్థాయిలో సర్వే పూర్తి చేసి లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.

జీఓ 58, 59, 76 కింద పట్టాల పంపిణీ ప్రారంభించి మార్చి చివరి వరకు పూర్తి చేయాలన్నారు. రాష్ట్రంలో నిరుపేదలకు భూమి పట్టాలను అందజేసేందుకు కార్యాచరణ రూపొందించాలని స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా పంపిణీ చేసేందుకు కృషి చేయాలని, విధుల్లో అలసత్వం వహించొద్దన్నారు.

తెలంగాణకు హరిత హారం కార్యక్రమంలో భాగంగా 2023 -24లోమొక్కలు నాటేందుకు వెంటనే కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్లను ఆదేశించారు. మొక్కల సంరక్షణ కోసం నీటి వినియోగం సక్రమంగా ఉండేలా చూసుకోవాలన్నారు. ఆయిల్ పామ్ సాగు లక్ష్యాల సాధనకు కృషి చేయాలని, జిల్లాల్లో సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లోకి అన్ని ప్రభుత్వ కార్యాలయాలను తరలించే ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 25 పని దినాలలో 51.86 లక్షల మంది ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి, 9 లక్షల రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. కంటి వెలుగు శిబిరాలనుకలెక్టర్లు, జిల్లా అధికారులు సందర్శించాలని ఆదేశించారు. ప్రిస్క్రిప్షన్ కళ్ళద్దాల పంపిణీలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, ఆర్ధిక శాఖ కార్యదర్శి శ్రీదేవి, జీహెచ్ ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, మున్సిపల్ శాఖ కమిషనర్ సత్యనారాయణ, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ శ్వేతా మొహంతి, పీసీసీఎఫ్ డోబ్రియల్, హార్టికల్చర్ డైరెక్టర్ హన్మంతరావు, సీసీఎల్‌ఏ ప్రత్యేక అధికారి సత్యశారద న్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed