7 సీట్లలో బీఆర్ఎస్, 10 సీట్లలో బీజేపీ పోటీ: సీఎం రేవంత్ రెడ్డి

by GSrikanth |
7 సీట్లలో బీఆర్ఎస్, 10 సీట్లలో బీజేపీ పోటీ: సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్, బీజేపీ దోస్తీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి మేడారంలో పర్యటించారు. అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించారు. అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య అవగాహన ఒప్పందం ఉందని కీలక ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే పొత్తు పెట్టుకొని 7 పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్, 10 నియోజకవర్గాల్లో బీజేపీ పోటీ చేయబోతోందని జోస్యం చెప్పారు. కేసీఆర్ అవినీతిపై సీబీఐకి ఇవ్వాలని బీజేపీ కోరుతోందని అన్నారు. పదేళ్లుగా కేంద్రంలో బీజేపీనే అధికారంలో ఉందని గుర్తుచేశారు.

సీబీఐ, ఈడీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలన్నీ కేంద్రం చేతిలోనే ఉన్నాయని.. మరి ఎందుకు పదేళ్లలో కేసీఆర్‌పై ఒక్క కేసు కూడా పెట్టలేదని ప్రశ్నించారు. ఎందుకు కేసీఆర్ ప్రభుత్వ అవినీతిపై విచారణ చేపట్టలేదని అడిగారు. గతంలో తాము కూడా కేంద్రానికి ఫిర్యాదు చేశామని.. అయినా విచారణ చేయలేదని గుర్తుచేశారు. న్యాయ విచారణ నిర్ణయం తీసుకున్న తర్వాత బీజేపీ సీబీఐ విచారణ కోరుతోందని విమర్శించారు. అసలు బీజేపీకి కావాల్సింది కేసీఆర్ జైలుకు వెళ్లడం కాదని.. కేసీఆర్ దోపిడీలో వాటా కోసమే బీజేపీ సీబీఐ విచారణ కోరుతోందని చెప్పారు. అతి త్వరలో విశ్రాంత హైకోర్టు లేదా సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరుపుతామని అన్నారు.



Next Story

Most Viewed