తెలంగాణ వైద్యరంగంలో నూతన విప్లవం.. ఇవాళ లాంఛనంగా ప్రారంభించనున్న కేసీఆర్!

by Disha Web Desk 2 |
తెలంగాణ వైద్యరంగంలో నూతన విప్లవం.. ఇవాళ లాంఛనంగా ప్రారంభించనున్న కేసీఆర్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో నూతనంగా నిర్మించిన 8 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో విద్యాబోధన తరగతులను ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు మంగళవారం ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రగతి భవన్ నుంచి ఆన్ లైన్లో అన్ని కాలేజీలను ఒకేసారి షురూ చేయనున్నారు. దీంతో సంగారెడ్డి, మహబూబాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్‌కర్నూలు, రామగుండం పట్టణాల్లోని 8 నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్​తొలి విద్యా సంవత్సరం సీఎం కేసీఆర్​చేతుల మీదుగా ప్రారంభం కానున్నది. ఇది దేశ చరిత్రలోనే ఇది అత్యంత అరుదైన సందర్భంగా వైద్యశాఖ ఆఫీసర్లు పేర్కొంటున్నారు. తెలంగాణ ఏర్పడే నాటికి కేవలం 5 మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉండేవి. ఇందులో గాంధీ (1954), ఉస్మానియా (1946) మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్​ఆవిర్భవించే నాటికే ఉన్నాయి. ఈ లెక్కన గత ప్రభుత్వాలు కలిసి 57 ఏండ్లలో ఏర్పాటు చేసినవి కేవలం మూడు మెడిక‌ల్ కాలేజీలే అని చెప్పుకోవచ్చు. కాకతీయ మెడికల్‌ కాలేజీని 1959లో ఏర్పాటు చేయ‌గా, ఆ త‌ర్వాత ఆదిలాబాద్‌లో రిమ్స్‌, నిజామాబాద్‌లో మెడికల్‌ కాలేజీలు ఏర్పాటయ్యాయి.

గతంలో ఇలా..?

అన్ని జిల్లాల్లో మెడిక‌ల్ కాలేజీలు లేకపోవడంతో సూప‌ర్ స్పెషాలిటీ వైద్యం అందక ప్రజలు ఎంతో క‌ష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఏదైనా పెద్ద వ్యాధి వ‌స్తే మెరుగైన వైద్యం పొందడం కొరకు హైద‌రాబాద్‌కు ప‌రిగెత్తాల్సి వ‌చ్చేది. వంద‌ల కిలోమీట‌ర్లు, గంట‌ల పాటు ప్రయాణించి హైద‌రాబాద్‌కు చేరుకొని, చికిత్స కోసం వారాలు, నెల‌ల పాటు దవాఖానలలోనే ఉండాల్సిన ప‌రిస్థితి. దీంతో ఎన్నో కుటుంబాలు ఇబ్బందులను ఎదుర్కొంటూ ఆగమ‌య్యేవి. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సూప‌ర్ స్పెషాలిటీ వైద్యం అంద‌ని ద్రాక్షగానే మిగిలేది. దీంతో పాటు వైద్య విద్య సైతం భారంగా ఉండేది. కేవ‌లం ఐదు కాలేజీలు మాత్రమే ఉండ‌టంతో 850 ఎంబీబీఎస్​సీట్లుఅందుబాటులో ఉండేవి. దీంతో మెడిసిన్‌ చదవాలనుకున్న ఎంతోమంది విద్యార్థులు కలల‌కు దూరం అయ్యేవారు. మరి కొందరు మెడిసిన్ కోసం చైనా, ఉక్రెయిన్‌, ఫిలిప్పిన్స్ వంటి దేశాల‌కు దేశాలకు వెళ్లి రూ.కోట్లు ఖ‌ర్చు పెట్టి అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. దీన్ని గుర్తించిన ప్రభుత్వం సూప‌ర్ స్పెషాలిటీ సేవ‌ల‌ను పేద‌లకు చేరువ చేయ‌డంతో పాటు, వైద్య విద్యను ఎక్కువ మంది విద్యార్థుల‌కు అందించాలనే ప్లాన్‌తో జిల్లాకో మెడికల్​కాలేజీని తీసుకొచ్చేందుకు ప్లాన్​చేశారు.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇలా..

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే, మొదటి దశలో మహబూబ్‌ నగర్‌, సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేట్‌లో మెడిల్‌ కాలేజీలు ఏర్పాటు చేశారు. రెండో దశలో మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, నాగర్‌ కర్నూల్‌, మహబూబాబాద్‌, సంగారెడ్డిలో కాలేజీలను ర్పాటు చేశారు. దీంతో ప్రస్తుతం ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 17కు పెరిగింది. ఎనిమిదేండ్లలోనే కాలేజీల సంఖ్య మూడున్నర రెట్లు పెరిగింది. ఇక వచ్చే ఏడాది 9, ఆపై ఏడాది మరో 8 మెడికల్‌ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటుచేయనున్నది.

సీట్లు పెరిగాయి..

కొత్త కాలేజీలతో రాష్ట్ర వ్యాప్తంగా అదనంగా 1,150 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో 2014లో 850గా ఉన్న ఎంబీబీఎస్‌ సీట్లు ఇప్పుడు 2,790కి పెరిగాయి. ఇక పీజీ సీట్లు 531 నుండి 1122 కు పెరిగాయి. సూపర్‌ స్పెషాలిటీ సీట్లు 76 నుండి 152 కు పెరిగాయి.

కాలేజీలతో లాభాలు..

మెడిక‌ల్ కాలేజీల ద్వారా స్పెషాలిటీ, సూప‌ర్ స్పెషాలిటీ సేవ‌లు ప్రజలకు అందుతాయి. సూప‌ర్ స్పెషాలిటీ సేవ‌లు క‌లుపుకొని, ఒక్కో కాలేజీలో 35 వైద్య విభాగాలు సేవ‌లందిస్తాయి. అత్యాధునిక వైద్య ప‌రిక‌రాలు, ల్యాబ్స్ ఉంటాయి. వైద్యులు, 449 మంది డాక్టర్లు అందుబాటులో ఉంటారు. 600 పైగా పారామెడిక‌ల్ సిబ్బంది ఉంటుంది. ఏదైనా పెద్ద వ్యాధి వ‌చ్చినా హైద‌రాబాద్ వ‌ర‌కు ప‌రిగెత్తాల్సిన అవ‌స‌రం లేకుండా జిల్లాల్లోనే మంచి వైద్యం అందే ఆస్కారం ఉంటుంది.దీంతో పాటు రాష్ట్ర విద్యార్థులు స్థానికంగా మెడిసిన్​ చదువుకునే అవకాశాలు పెరుగుతాయి.డ‌బ్బు ఖ‌ర్చు చేసుకొని విదేశాల‌కు వెళ్లే అవ‌స్థ త‌ప్పుతుంది. విదేశీ బాష‌ల్లో ఎంబీబీఎస్ అభ్యసించే బాధ తప్పనున్నది. కాలేజీలు, దాని అనుబంధ ఆసుపత్రులలో భారీగా సిబ్బంది అవసరం ఏర్పడుతుంది. దీంతో స్థానికుల‌కు ప్రత్యక్ష, ప‌రోక్షంగా ఉపాధి పెరుగుతుంది. విద్యార్థులు, డాక్టర్లు, సిబ్బంది, హాస్పిట‌ల్‌కు వ‌చ్చే రోగులు, స‌హాయ‌కులు ఇలా ఆ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయి. త‌ద్వారా ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందే ఛాన్స్​ఉంటుంది.

ఇవి కూడా చదవండి : ప్రైవేటు వర్శిటీల బిల్లుపై గవర్నర్ అసహనం.. మరోసారి రాజ్ భవన్‌కు మంత్రి సబిత?



Next Story

Most Viewed