బీజేపీ ఎంపీలకు రాష్ట్రంలో అడుగుపెట్టే హక్కులేదు: వినోద్ ఫైర్

by Disha Web Desk 19 |
బీజేపీ ఎంపీలకు రాష్ట్రంలో అడుగుపెట్టే హక్కులేదు: వినోద్ ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రం నుంచి నలుగురు బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు.. చాతకాని తనంపై ప్రజలకు సమాధానం చెప్పాలి.. రాష్ట్రంలో అడుగు పెట్టే నైతిక హక్కు వారు కోల్పోయారని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో కొత్త స్కీమ్స్ లేవు అని, ఏ రంగాన్ని కూడా మేలు చేయని ఘోరమైన కేంద్ర బడ్జెట్ ఇది అని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వాలను నిర్వీర్యం చేస్తూ ఒంటెద్దు పోకడలతో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని, అలాంటప్పుడు బడ్జెట్ సత్ ఫలితాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. బుధవారం తెలంగాణ భవన్‌లో కేంద్రబడ్జెట్‌పై మీడియాతో మాట్లాడారు. కేంద్ర బడ్జెట్ ఆచరణ సాధ్యం కావాలంటే.. రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కేంద్రం పనిచేస్తేనే మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాలు ఒకే విధంగా లేవని, కొన్ని రాష్ట్రాలు ఆర్థికంగా బలహీనంగా, మరికొన్ని రాష్ట్రాలు ఆర్థికంగా బలంగా ఉన్నాయన్నారు.

కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా ఒకే రకమైన స్కీంను దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తోందని, ఇది ఆచరణ యోగ్యం కాని ప్రయోగం అన్నారు. ఒకే దేశం, ఒకే చట్టం అని, డబుల్ ఇంజన్ సర్కార్ అని కేంద్ర ప్రభుత్వం ఏవేవో ఆలోచనలు చేస్తోందని మండిపడ్డారు. రాజ్యాంగం పట్ల అవగాహన లేకుండా కేంద్ర ప్రభుత్వం పరిపాలిస్తోందన్నారు. కేంద్ర జనరల్ బడ్జెట్‌లో రైల్వే బడ్జెట్ ను కలపడంతో అంతా గందరగోళం నెలకొందని, కేంద్ర బడ్జెట్‌లో అన్ని పద్దుల్లో రైల్వే పద్దు ఒకటిగా మారిపోయిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం గత ఎనిమిదేళ్లలో 157 మెడికల్ కాలేజీలు దేశవ్యాప్తంగా మంజూరు చేస్తే.. తెలంగాణ రాష్ట్రానికి ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. నర్సింగ్ కాలేజీలు ఇస్తామని కేంద్ర బడ్జెట్‌లో చెప్తున్నారని, నర్సింగ్ కాలేజీలలో కూడా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయమే జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని కేసీఆర్ మంజూరు చేశారని, ఈ మెడికల్ కాలేజీలకు కేంద్రం ఒక్కో దానికి రూ. 400 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని కొత్త జిల్లాల్లో నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని గత తొమ్మిదేళ్లుగా కేంద్ర ప్రభుత్వానికి కోరుతున్నా దాని ఊసే లేకుండా పోయిందన్నారు. ఎన్నికల సందర్భంగా మాత్రమే మోడీకి నిధుల మంజూరు, శంకుస్థాపన గుర్తుకు వస్తాయని, ఇలా గుజరాత్ ఒక్క రాష్ట్రానికే లక్షా 35 వేల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి నరేంద్ర మోడీ శంకుస్థాపనలు చేశారన్నారు. కర్ణాటక రాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో 5,300 కోట్ల రూపాయల నిధులను నరేంద్ర మోడీ మంజూరు చేశారని ధ్వజమెత్తారు. దేశంలోని బ్యాంకులను ముంచిన బడా బాబులను విదేశాల నుంచి రప్పిస్తానని చెప్పిన మోడీ.. వారు విదేశాల్లో జల్సాలు చేస్తున్నా పట్టించుకోకుండా దేశ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. మోడీ చెప్పింది ఒక్కటి కూడా నిజం కాలేదన్నారు.


Next Story

Most Viewed