లీకేజీలో కేటీఆర్ తప్పించుకునే యత్నం.. డీకే అరుణ

by Dishafeatures2 |
లీకేజీలో కేటీఆర్ తప్పించుకునే యత్నం.. డీకే అరుణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనలో మంత్రి కేటీఆర్ తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. మంత్రి కేటీఆర్ టీఎస్పీఎస్సీ విషయంలో నాకేం సంబంధం ఉంది అంటున్నారని మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ వ్యవహారంలో పెద్దల హస్తం ఉందన్నారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీలో ఘటనపై విచారిస్తున్న సిట్ ముఖ్యమంత్రి కేసీఆర్ జేబు సంస్థగా తయారైందని విమర్శించారు. సీఎం కేసీఆర్ సిట్ అంటే సిట్ అని, స్టాండ్ అంటే స్టాండ్ అన్నట్లు సిట్ వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు.

ఈ స్కాం విచారణ సిట్ వల్ల కాదని, సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. 30 లక్షల మంది అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేసిన ఘనకార్యం ఏమీ లేదని, గొప్పలు చెబుతూ రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల 6న రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవంతో పాటు, 14 వరకు అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.



Next Story