KCRకు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి గజ్వేల్ BRS టాప్ లీడర్స్

by Disha Web Desk 4 |
KCRకు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి గజ్వేల్ BRS టాప్ లీడర్స్
X

దిశ, సంగారెడ్డి బ్యూరో : వలసలతో గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీ దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నది. పదేండ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వందల కోట్లతో నియోజకవర్గం అభివృద్ధి జరిగిందని ఆ పార్టీ గొప్పలు చెప్పుకున్నది. అయితే నియోజకవర్గ పార్టీ నాయకుల్లో మాత్రం తీవ్రమైన నిరసన ఉన్నది. రోజువారిగా బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ లో చేరిపోతుండడం మాజీ సీఎం కేసీఆర్ కు కొంత తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. గజ్వేల్ కు ఎంతో చేశానని కేసీఆర్ చెప్పుకుంటే ఆ పార్టీ నాయకులు మాత్రం కాంగ్రెస్ లోకి వెళ్లిపోతున్నారు.

ఇదే నియోజకవర్గంలోని కొండపాకకు చెందిన డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడం బీఆర్ఎస్ కు పెద్ద షాక్ గానే చెప్పుకోవచ్చు. అంతకు ముందే మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్​ రెడ్డి, గజ్వేల్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, ములుగు మండలం నుంచి సయ్యద్ సలీం ఇతర నాయకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ కార్పొరేషన్ చైర్మన్, సీనియర్ బీఆర్ఎస్ నేత మరొకరు కాంగ్రెస్ చేరనున్నట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతుంటే చూసి బీఆర్ఎస్ కార్యకర్తలు అయోమయంలో పడిపోతున్నారు. అసలు గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుందని తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

అభివృద్ధికి చిరునామాగా ప్రచారం

తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనతో గజ్వేల్ సెగ్మెంట్ ను అభివృద్ధికి చిరునామాగా చూపించారు. ఇక్కడి నుంచి మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహించడం...వందల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడంతో గజ్వేల్ విస్తృత ప్రచారంలోకి వచ్చింది. గజ్వేల్ ఆధునాతన కూరగాయల మార్కెట్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులు, కోమటిబండలో మిషన్ భగీరథ నీటి నిల్వ సంప్ లు ఉన్నాయి. వీటిని పరిశీలించడానికి దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఐఏఎస్ లు ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు వచ్చిన విషయం తెలిసిందే. గజ్వేల్ దేశానికే రోల్ మాడల్ గా చరిత్రకెక్కింది. కేసీఆర్ వందల కోట్లు తన నియోజకవర్గానికి ఖర్చు పెడుతున్నారని ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తి పోశాయి కూడా. సీఎం కేసీఆర్ గజ్వేల్ కు రావడంతో ఇక్కడ ప్రతిపక్షమే లేకుండా అన్ని పార్టీలు దాదాపుగా తుడిచిపెట్టుకుపోయి బీఆర్ఎస్ ఒక్క పార్టే ఉన్నది అనేలా మారిపోయింది.

మూడు నెలల్లో పరిస్థితులో తారుమారు

కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రతిపక్ష పార్టే గజ్వేల్ లో లేకుండా పోయింది అనే పరిస్థితులు కనిపించాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ ఫలితాల తరువాత గజ్వేల్ లో పరిస్థితులు వేగంగా మారుతూ వస్తున్నాయి. అప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ అన్నవారు, ఆ పార్టీలో పదవులు పొందిన వారు ఒక్కక్కరుగా కాంగ్రెస్ పార్టీల చేరిపోతున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసి బీఆర్ఎస్ లోకి వచ్చిన వారంతా దాదాపుగా అందరూ తిరిగి మళ్లీ కాంగ్రెస్ లో గూటికి చేరుతున్నారు. నియోజకవర్గ కేంద్రం గజ్వేల్ మొదలుకుని గజ్వేల్, తూప్రాన్, కొండపాక, ములుగు, వర్గల్, జగదేవ్ పూర్, మర్కుక్, మనోహరాబాద్ మండలాల నుంచి బీఆర్ఎస్ ముఖ్య నాయకులు వరుసకట్టి బీఆర్ఎస్ లో చేరిపోవడం పార్టీలో తీవ్ర చర్చకు దారితీస్తున్నది. పదవులు పొందిన వారే పార్టీని వీడివెళ్లిపోవడాన్ని కింది స్థాయి కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు.

నేడో..రేపో..మాజీ కార్పొరేషన్ చైర్మన్

ఇప్పటికే గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతకు ముందే తూప్రాన్ కు చెందిన మాజీ కార్పొరేషన్ చైర్మన్, డీసీసీబీ మాజీ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి, గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, ములుగు మార్కెట్ కమటి వైఎస్ చైర్మన్ సయ్యద్ సలీమ్ లతో పాటు నియోజకవర్గంలోని ఆయా నియోజకవర్గాలకు చెందిన సర్పంచ్ లు ఇతర ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయిన విషయం తెలిసిందే. ఇదెలా ఉండగా నియోజకవర్గానికి చెందిన సీనియర్ బీఆర్ఎస్ నాయకులు, మాజీ కార్పోరేషన్ చైర్మన్ మరొకరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్ అధిష్టానంతో ఆయన చర్చలు పూర్తయ్యాయని, నేడో, రేపో ఆయన చేరిక దాదాపుగా ఖాయమైందని ఆయన సన్నిహితులు ద్వారా తెలిస్తోంది. ఈ చేరికల పరంపర ఇలాగే కొనసాగితే బీఆర్ఎస్ కు నష్టం తప్పదని రాజకీయ పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి చేరికలపై ప్రత్యేక నజర్ పెటాడని, మరిన్ని చేరికలు ఉంటాయని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.



Next Story

Most Viewed