మోడీ సభ సక్సెస్‌పై మెగా ప్లాన్

by S Gopi |
PM Modi Says, Nepotism and Corruption Indias Biggest Challenges On occasion of independence day
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈనెల 12న రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఈ సభకు భారీగా జన సమీకరణ చేపట్టాలని డిసైడ్ అయింది. కనీసం లక్ష మందికి తగ్గకుండా సభను సక్సెస్ చేయాలని భావిస్తోంది. ప్రధాని రాక నేపథ్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, జన సమీకరణపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ శనివారం ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. జన సమీకరణ, సభ విజయవంతం విషయంలో జిల్లా నాయకులంతా సమన్వయంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రధానికి భారీ స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అన్ని నియోజక వర్గాల నుంచి రైతులు, కార్యకర్తలు తరలివచ్చేలా ర్యాలీలు నిర్వహించాలన్నారు. ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, రూ. 6,120 కోట్ల వ్యయంతో రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించడం వల్ల రైతులకు కలిగే ప్రయోజాలను రైతులకు వివరించాలని వెల్లడించారు. రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ ద్వారా తెలంగాణ, ఏపీ సహా దక్షిణ భారత రైతులందరికీ కొరత లేకుండా ఎరువులను సరఫరా చేయబోతున్నామనే విషయంపై రైతులకు, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మోడీ ప్రభుత్వం రైతు ప్రయోజనాల విషయంలో రాజీపడటం లేదన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ.., ఆ భారం రైతులపై పడొద్దనే ఉద్దేశంతో ఏటా రూ. వేలాది కోట్లు ఖర్చు పెట్టి సబ్సిడీపై ఎరువులు అందిస్తున్నామని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బండి సంజయ్ దిశానిర్దేశం చేశారు.

మునుగోడు ఎన్నికల అంశాన్ని ప్రస్తావించిన బండి సంజయ్ ఈ ఉప ఎన్నికల్లో పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క ఉప ఎన్నిక గెలిచేందుకు రూ. వెయ్యి కోట్లకు పైగా ఖర్చు చేశారని, విచ్చలవిడిగా మద్యం ఏరులై పారించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, పోలీస్ కమిషనర్, ఎస్పీ టీఆర్ఎస్ తొత్తులుగా మారారని మండిపడ్డారు. ఏడేళ్లుగా ఒకే పోస్టింగ్ లో ఉన్న పోలీస్ కమిషనర్.. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కార్యకర్తల్లా పనిచేశారని ధ్వజమెత్తారు. బీజేపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసి కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. ఇన్ని చేసినా ప్రజలు బీజేపీ వైపే ఉన్నారని పేర్కొన్నారు. మునుగోడులో బీజేపీ విజయం ఖాయమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎంపీ సోయం బాబూరావు, పార్టీ జాతీయ కార్యవర్గసభ్యుడు ఈటల రాజేందర్, వివేక్, మాజీ మంత్రులు విజయరామారావు, సుద్దాల దేవయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, ఎన్వీఎస్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.



Next Story