తమిళిసైని విమర్శిస్తూ వ్యాసం.. డీఎంకే నేతలపై గవర్నర్ ఫైర్

by Sathputhe Rajesh |
తమిళిసైని విమర్శిస్తూ వ్యాసం.. డీఎంకే నేతలపై గవర్నర్ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణలో గొప్పలు చెప్పేందుకు వీలుకాక, తమిళనాడును విమర్శిస్తున్నారంటూ గవర్నర్ తమిళిసైని ఉద్దేశించి డీఎంకే అధికార పత్రిక 'మురసోలి'లో ప్రచురితమైన ఓ వ్యాసంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీనికి స్పందిస్తూ తమిళిసై తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. ఇంట్లో తెలుగు మూలాలు ఉండి, ఇంట్లో ఆ భాష మాట్లాడుతూ బయట తమిళ వేషం వేసేవారు, తనలా నిజమైన తమిళ రక్తం ప్రవహించే వారి వైఖరిని జీర్ణించుకోలేకపోతున్నారని తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడుపై అభిప్రాయాలు వ్యక్తం చేయవద్దని చెప్పేందుకు వారు ఎవరు అని ప్రశ్నించారు. డీఎంకే తనను తాను అగ్నిపర్వతం అని చెప్పుకుంటోందని, కానీ అది హిమాలయాలను ఏమీ చేయలేదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. ఏం చేసినా భయపడేవారే గవర్నర్లను విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. నిజాలు మాట్లాడే మాకు భయం ఉండదన్నారు. కొంత మందికి మోదీ ఫోబియా ఎక్కువగా ఉందని విమర్శించారు. సీరియళ్లు, సినిమాల్లో నటించి పదవుల్లోకి వచ్చిన వారికి మాత్రమే కెమెరా, మైక్ మేనియాలు ఉంటాయని తీవ్ర విమర్శలు చేశారు. నిజాలు మాట్లాడే తమకు ఉండవని పేర్కొన్నారు. తెలంగాణలో జరుగుతున్నదేంటో తెలుసుకుని మాట్లాడాలన్నారు. తనను విమర్శించడానికి ముందు తెలంగాణ పత్రికల్లో వచ్చే వార్తలు చూస్తే ఎవరు వణుకుతున్నారో అర్థమవుతుందన్నారు. తమిళనాడులో వారసత్వ రాజకీయ ప్రభుత్వాన్ని ప్రజల ముందు నిలదీస్తున్నందునే గవర్నర్ రవిపై అధికార పార్టీ నేతలకు కోపమని తమిళిసై పేర్కొన్నారు.తమిళనాడు, పుదుచ్చేరిలలో పనిచేస్తూ మార్గమధ్యలో ఒకటి, రెండు కార్యక్రమాల్లో పాల్గొనేవారు తనను విమర్శించే పని పెట్టుకోవద్దని తమిళిసై అన్నారు.



Next Story

Most Viewed