పోడు భూములకు పట్టాలు ఇప్పిస్తా.. ఎమ్మెల్యే కోనప్ప కీలక హామీ

by Dishanational4 |
పోడు భూములకు పట్టాలు ఇప్పిస్తా.. ఎమ్మెల్యే కోనప్ప కీలక హామీ
X

దిశ, కాగజ్ నగర్: పోడు భూములకు పట్టాలు ఇప్పిస్తానని సిర్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. ఆదివారం సిర్పూర్ టీ మండలంలో బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం సభకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిర్పూర్ నియోజకవర్గంలో నిరుపేదలు ఏళ్లుగా సాగు చేసుకుంటున్న అటవీశాఖ భూముల్లో అర్హులైన వారికి పోడు పట్టాలు ఇప్పిస్తానని అన్నారు. సిర్పూర్ నియోజకవర్గంలో 15 ఏళ్లుగా ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధిపై పోరాటం చేస్తున్నానని, బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే పునాదని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రారంభించి ఇంటింటా పథకాలను అందేలా చూస్తున్నారని, మారుమూల గ్రామాల్లో సైతం అభివృద్ధి దిశలో సాగుతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న సంక్షేమ పథకాలను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కోరవడం లేదని రానున్న రోజుల్లో మళ్లీ బీఆర్ఎస్ పార్టీకే ప్రజలు పట్టం కట్టాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం కొమురం భీంజిల్లా ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతున్నారని.. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమం అభివృద్ధి దిశగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


Next Story