టాటా మోటార్స్ నష్టాలు రూ. 7,605 కోట్లు

by  |
టాటా మోటార్స్ నష్టాలు రూ. 7,605 కోట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ 2020-21 ఆర్థిక సంవత్సరంలో మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ. 7,605.4 కోట్ల నికర నష్టాలను ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 9,894.2 కోట్ల నష్టాలను నమోదు చేసింది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ. 88, 628 కోట్లు ఉండగా, గతేడాది ఇదే కాలంలో రూ. 62,492 కోట్లతో పోలిస్తే 42 శాతం పెరిగింది. ఇక, 2020-21 పూర్తి ఆర్థిక సంవత్సరానికి టాటా మోటార్స్ రూ. 13,395 కోట్ల నికర నష్టాలను రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. అలాగే, రూ. 2,52,438 కోట్ల ఆదాయాన్ని వెల్లడించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ. 11,975 కోట్ల లాభాలను, రూ. 2,64,041 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది.

మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ భారత వ్యాపారంలో వార్షిక ప్రాతిపదికన ఆదాయం 106 శాతం పెరిగి రూ. 20,046 కోట్లకు చేరుకుందని, అనుబంధ సంస్థ జాగ్వార్ అండ్ ల్యాండ్‌రోవర్(జేఎల్ఆర్) అమ్మకాలు 20.5 శాతం పెరిగిందని కంపెనీ పేర్కొంది. ‘వినియోగదారుల సెంటిమెంట్ మెరుగ్గా ఉండటం, ఈ-బిజినెస్ తేలికగా కొనసాగడం, సరుకు రవాణా ధరలు,మౌలిక సదుపాయాలా డిమాండ్ నేపథ్యంలో త్రైమాసిక పరంగా వృద్ధి కనిపిస్తోంది. కమర్షియల్ వాహనాల విభాగంలోనూ అమ్మకాలు స్థిరంగా ఉన్నాయి. ఖర్చులు తగ్గించుకోవడం ద్వారా కార్యకలాపాలు, ఆర్థిక పనితీరును సానుకూలంగా కొనసాగించామని’ టాటా మోటార్స్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ గుయెంటర్ బుట్సెక్ అన్నారు. మంగళవారం ఆర్థిక ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేర్ ధర 3.4 శాతం పెరిగి రూ. 332 వద్ద ముగిసింది.


Next Story

Most Viewed