వాళ్లు లేకపోయినా గెలిచి చూపించాం : సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు

by Dishanational3 |
వాళ్లు లేకపోయినా గెలిచి చూపించాం : సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌ను టీమ్ ఇండియా 3-1తో సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ విజయంపై భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. తాము లేకపోతే భారత్ గెలవదనుకునే పెద్ద ఆటగాళ్లకు ఇది గట్టి సందేశమని వ్యాఖ్యానించాడు. ‘మూడేళ్ల క్రితం ఆస్ట్రేలియా టూరుకు కూడా కొన్ని పెద్ద పేర్లు మిస్సయ్యాయి. అయితే, భారత జట్టు గబ్బాలోనే కాకుండా సిరీస్‌లోనూ అద్భుత విజయం సాధించింది. అడిలైడ్‌లో 36 పరుగులకే ఆలౌటైన తర్వాత మెల్‌బోర్న్‌లో గెలిచాడు. సిడ్నీలో డ్రా చేసుకున్నారు. రిషబ్ కాసేపు క్రీజులో ఉంటే ఆ టెస్టులోనూ భారత్ గెలిచేదేమో.’ అని చెప్పాడు.

ఆస్ట్రేలియా టూరులో యువ ఆటగాళ్లు చూపించిన తెగువ ఇప్పుడు ఇంగ్లాండ్‌పై కూడా కనిపించిందని చెప్పాడు. ‘అందుకే నేను ఎప్పుడు చెబుతుంటాను. పెద్ద ఆటగాళ్లు అవసరం లేదు. పెద్ద స్టార్లు లేకపోయినా గెలవగలమని ఈ రెండు సిరీస్‌లు నిరూపించాయి. క్రికెట్ అనేది జట్టుగా పోరాడేది. కేవలం ఒకరిద్దరి మీదనే ఆధారపడి ఉండదు.’ అని చెప్పుకొచ్చాడు. అయితే, కెప్టెన్ రోహిత్, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు క్రెడిట్ ఇవ్వాల్సిందేనన్నాడు. వారిద్దరు యువ ఆటగాళ్లు అవకాశాలు ఇవ్వడంతోపాటు వారి సహన ఆట ఆడేలా ప్రోత్సహించారని తెలిపాడు.

కాగా, ఈ సిరీస్‌కు విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ సిరీస్ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే. తొలి టెస్టులో గాయపడిన కేఎల్ రాహుల్ ఆ తర్వాత మిగతా మ్యాచ్‌ల నుంచి తప్పుకున్నాడు. అదే సమయంలో యశస్వి జైశ్వాల్, శుభ్‌మన్ గిల్, ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, ఆకాశ్ దీప్‌లాంటి యువ ఆటగాళ్లు సత్తాచాటారు. ఈ నెల 7 నుంచి 11 వరకు ధర్మశాల వేదికగా చివరి టెస్టు జరగనుంది.



Next Story

Most Viewed