తాత్కాలిక రెజ్లింగ్ కమిటీ.. చైర్మన్‌గా భూపిందర్‌ సింగ్‌ బజ్వా

by Vinod kumar |
తాత్కాలిక రెజ్లింగ్ కమిటీ.. చైర్మన్‌గా భూపిందర్‌ సింగ్‌ బజ్వా
X

న్యూఢిల్లీ: కొత్తగా ఎన్నికైన పాలకవర్గాన్ని కేంద్రం సస్పెండ్ చేసిన నేపథ్యంలో దాని స్థానంలో ‘భారత రెజ్లింగ్‌ సమాఖ్య’(డబ్ల్యూఎఫ్ఐ) వ్యవహారాలను చూసుకునేందుకు భారత ఒలింపిక్ అసోసియేషన్(ఐవోఏ) బుధవారం తాత్కాలిక రెజ్లింగ్‌ బాడీ (అడహక్‌ కమిటీ)ని నియమించింది. ఈ కమిటీకి భూపిందర్‌ సింగ్‌ బజ్వా నేతృత్వం వహించనుండగా, ఎంఎం. సౌమ్య, మంజూష కన్వర్‌లు సభ్యులుగా కొనసాగుతారని ప్రకటించింది. డబ్ల్యుఎఫ్‌ఐలో న్యాయమైన, జవాబుదారీతనం, పారదర్శకత్వాన్ని నిర్ధారించడానికి ఈ అడహక్‌ కమిటీని నియమించినట్లు ఐవోఏ తెలిపింది. ఈ మేరకు ఐవోఏ చీఫ్ పీటీ ఉషా ఓ ప్రకటన విడుదల చేశారు.

డబ్ల్యుఎఫ్‌ఐకి ఇటీవల ఎన్నికైన అధ్యక్షుడు, అధికారులు రెజ్లింగ్‌ రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించడంతోపాటు ఏకపక్ష నిర్ణయాలను తీసుకున్నారని, ఐవోసీ ప్రతిపాదించిన సుపరిపాలన సూత్రాలకు వ్యతిరేకంగా, తగిన ప్రక్రియను అనుసరించకుండా నియంతృత్వంగా వ్యవహరించారని ఉషా ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌ సన్నిహితుడు సంజయ్ సింగ్‌ డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్‌గా ఎన్నికైన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, రెజ్లింగ్‌కు సాక్షి మాలిక్‌ రిటైర్మెంట్‌ ప్రకటించగా, మరో రెజ్లర్‌ బజరంగ్‌ పునియా పద్మశ్రీని వెనక్కి ఇచ్చేశాడు. ఖేల్‌రత్న, అర్జున అవార్డులను వెనక్కి ఇచ్చేస్తున్నట్లు వినేష్‌ ఫోగట్‌ ప్రకటించింది. రెజ్లర్ల ఆందోళనలవేళ కేంద్రం డబ్ల్యుఎఫ్‌ఐకి ఎన్నికైన నూతన కమిటీని రద్దు చేస్తున్నట్టు ఆదివారం ప్రకటించింది.

Next Story