టార్గెట్ సాకర్ వరల్డ్ కప్.. ఫుట్ బాల్ అభివృద్ధికి కేంద్రం కార్యాచరణ

by  |
టార్గెట్ సాకర్ వరల్డ్ కప్.. ఫుట్ బాల్ అభివృద్ధికి కేంద్రం కార్యాచరణ
X

దిశ, స్పోర్ట్స్: ఇండియా అనగానే అందరికీ గుర్తొచ్చేది క్రికెట్టే. మన దేశంలో క్రికెట్‌‌కు ఉన్న పాపులారిటీతో మిగిలిన క్రీడలు మరుగున పడిపోయాయి. ఒక మ్యాచ్‌లో బ్యాట్స్‌మ్యాన్ సెంచరీ కొడితే పత్రికల్లో పతాక శీర్షికలకు ఎక్కుతాడు. కానీ, వేరే క్రీడల్లోని ఆటగాళ్లు ఎంతగా రాణించినా అంత గుర్తింపు లభించదు. ఇండియాలో క్రికెట్ అంతగా వేళ్లూనుకుపోయింది. మర్రి చెట్టు నీడలో వేరే మొక్కలు ఎదగవన్నట్లు, క్రికెట్ కారణంగా చాలా క్రీడలు అభివృద్ధికి నోచుకోవట్లేదు. ముఖ్యంగా ప్రపంచమంతటా ఎంతో ఆదరణ ఉన్న ఫుట్‌బాల్‌కు ఇండియాలో అభిమానులు చాలా తక్కువ. అలాగని మన దగ్గర ప్రతిభ గల ఫుట్‌బాల్ ప్లేయర్లు లేరా? అంటే అదీ కాదు. కోల్‌కతాలోని మోహన్ బగాన్ వంటి క్లబ్ అంతర్జాతీయ స్థాయి ఫుట్‌బాల్ ఆడుతుంది. ఈశాన్య రాష్ట్రాలు, బెంగాల్, కేరళ వంటి ప్రాంతాల్లో ఫుట్‌బాల్ ఆడేవాళ్ల సంఖ్య చాలా ఎక్కువ. కానీ ఇండియాలో ఈ క్రీడ వ్యాపారపరంగా నిలదొక్కుకోలేదనే అనుమానాలతో నిర్లక్ష్యం చేశారు. రాబోయే 10-15 ఏళ్లలో సాకర్ వరల్డ్ కప్ టార్గెట్‌గా భారీ కార్యాచరణను రూపొందిస్తున్నట్లు కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.

ప్రోత్సాహం లేక మరుగున పడుతున్న ఆటగాళ్లెందరో..

భారత్‌లో అన్ని రకాల క్రీడలు ఆడేవాళ్లున్నారు. వారికి సరైన ప్రోత్సాహం, వేదిక దొరక్క మరుగున పడిపోతున్నారు. ఫుట్‌బాల్ క్రీడను కేంద్ర ప్రభుత్వం చాన్నాళ్లుగా నిర్లక్ష్యం చేయడంతో అంతర్జాతీయ వేదికలపై ఇతర దేశాలతో టీం ఇండియా పోటీ పడలేక పోతున్నది. బైచింగ్ భూటియా, సునీల్ ఛత్రి వంటి మేటి ప్లేయర్లు భారత ఫుట్‌బాల్ ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో చాటారు. కానీ, ఒక జట్టుగా ఇండియా ఇంకా చెప్పుకోదగిన రీతిలో రాణించలేదు. అయితే, ఐపీఎల్ విజయవంతం అయిన తర్వాత ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)ను ప్రారంభించారు. ఫుట్‌బాల్ క్లబ్స్‌ను ఏర్పాటు చేసి ప్రతి ఏడాది ఈ లీగ్ నిర్వహిస్తున్నారు. పీఎస్ఎల్ భారీ సక్సెస్ అవడంతో, ఫుట్‌బాల్‌కు ఇండియాలో మంచి భవిష్యత్ ఉన్నట్లు గ్రహించిన కేంద్రం భారీ కార్యాచరణను రూపొందించింది.

టాలెంట్ హంట్..

సుదీర్ఘ కాలంలో భారత ఫుట్‌బాల్ జట్టును అంతర్జాతీయంగా బలమైన జట్టుగా చేయాలనేదే లక్ష్యంగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పెద్ద ఎత్తున ప్రణాళికను రూపొందించారు. దేశవ్యాప్తంగా ఐదు జోనల్ కమిటీలను ఏర్పాటు చేసి ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించనున్నారు. ఈ ఫుట్‌బాల్ టాలెంట్ హంట్‌కు పూర్తి నిధులను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) అందించనుంది. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్‌ఈస్ట్ జోన్లుగా ఈ టాలెంట్ హంట్ జరగనుంది. 12 ఏళ్ల కంటే తక్కువ వయసు గల పిల్లలను ఈ టాలెంట్ హంట్‌లో గుర్తిస్తారు. ఇందుకోసం దేశంలోని నగరాలు, పట్టణాలు, మైదాన ప్రాంతాల్లోనే కాకుండా దండకారణ్యం వంటి ప్రాంతాల్లోని ఆదివాసి గ్రామాలకు కూడా వెళ్లాలని నిర్ణయించారు. దీనికి చాలా సమయం పడుతుంది. ఒకసారి దేశవ్యాప్తంగా ప్రతిభ గల ఫుట్‌బాలర్స్‌ను గుర్తించిన తర్వాత వారికి అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందిస్తారు. రాబోయే 10 నుంచి 15 ఏళ్లలో భారత ఫుట్‌బాల్ జట్టు వరల్డ్ కప్, ఒలంపిక్స్ వంటి మెగా ఈవెంట్లలో కూడా పాల్గొనేలా తీర్చుదిద్దుతారు. శాయ్, ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) ద్వారా కార్యాచరణ అమలు చేయనున్నట్లు కిరణ్ రిజిజు తెలిపారు. ఇందుకోసం ఐదు జోన్లలోని సాయ్ కేంద్రాల్లో ఫుట్‌బాల్ కోసం ప్రత్యేక వసతులు కూడా ఏర్పాటు చేయనున్నారు.



Next Story

Most Viewed