ఊరొదిలిన వాళ్లు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా..?

by  |
ఊరొదిలిన వాళ్లు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా..?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: పక్షం రోజులుగా పెరిగిన చలితో జనం చనిపోతుండడంతో ఆ పల్లె వాసులను కలవరపెడుతోంది. కరోనా తగ్గినా ఊరిలో జనం చావడంమేంటన్నదే వారి కలవరం. 50 ఏళ్ల క్రితం పల్లెల్లో ఇలాగే చావులు జరిగితే గ్రామ దేవతలకు పూజలు జరిపారు. ఇప్పుడు కూడా అలాగే చేస్తే బాగుంటుందేమోనని భావించిన ఆ ప్రాంత గ్రామీణులు పాత సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు.

సిరిసిల్ల జిల్లాలోని పలు గ్రామాల్లో పాత పద్ధతులను పాటిస్తున్నారు. కరోనా మహమ్మారితో పాటు మరో మాయరోగం అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయన్న ఆందోళన అక్కడి పల్లె వాసులను కలవరపెడుతోంది. ఈ రోగాలు ఊరి జనాలకు అంటుకుంటే ప్రాణాలు గాలిలో కలవడం ఖాయమన్న భయంతో చాలా గ్రామాల్లో ప్రజలు సామూహిక వనభోజనాలకు వెళ్తున్నారు. ఒక ఊరి నుంచి మరో ఊరికి ఈ విషయం పాకడంతో సిరిసిల్ల జిల్లాలోని చాలా పల్లెల్లో ఈ తంతు కొనసాగుతోంది. గ్రామ దేవతలను శాంతింపజేసేందుకు దాదాపు రెండు రోజులుగా వనభోజనాలకు వెళ్తున్నారు.

గ్రామమంతా జంతువుల ఊరేగింపు..

గ్రామ దేవతలకు పూజలు జరిపే వారు రెండు రోజుల ముందే గ్రామమంతా జంతువులను తిప్పి ఊరి పొలిమేరల్లో వదులుతున్నారు. రెండో రోజు గ్రామ దేవతలకు పూజలు చేసేందుకు ప్రజలంతా ఇళ్లు ఖాళీ చేసి పొలిమేర దాటి వెళ్లాల్సి ఉంటుంది. ప్రతి ఇంట్లోని చిన్నా పెద్దా అనకుండా అందరూ కూడా ఊరి పొలిమేర దాటి వెళ్లి అక్కడ వంటలు చేసుకుని తిని సాయంత్రం ఇళ్లకు వెళ్లాలి. గ్రామస్తులంతా సామూహిక వనభోజనాలకు వెళ్లిన తరువాత గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు జరిపి ఊర్లోకి దుష్ట శక్తులు రాకుండా వేడుకుంటారు. దీనివల్ల ఆయా పల్లె వాసులు ఎలాంటి రోగం సోకకుండా ఆరోగ్యంగా ఉంటారని పల్లె జనం నమ్ముతున్నారు.

గ్రామం విడిచి వెళ్లొద్దు..

ప్రత్యేక పూజలు, వనభోజనాల సందర్భంగా సంబంధిత పల్లెకు చెందిన వారెవరూ గ్రామం విడిచి వెళ్లొద్దు. తప్పనిసరి ఎవరైనా వెళ్లినా తిరిగి సాయంత్రం వరకు తమ ఇంటికి చేరుకోవాలి. అలాగే వేరే గ్రామానికి చెందిన వారు కూడా ఇదే పద్ధతిని పాటించాల్సి ఉంటుంది. ఈ విషయం ముందుగానే గ్రామంలో ప్రచారం చేస్తుండడంతో ఇరుగు పొరుగు గ్రామాలకు వెల్లడం కానీ, వేరే గ్రామానికి చెందిన వారు పల్లెకు రావడం లేదు.

జోగినీలచే భవిష్య వాణి..

సిరిసిల్ల జిల్లాలోని పలు గ్రామాల్లో సాగుతున్న ఈ తంతులో భాగంగా జోగినీలచే భవిష్యవాణి కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. పల్లె జనాన్ని చల్లగా చూడాలని కోరుతూ, రానున్న కాలంలో ఎలాంటి ఇబ్బందులు ఆ పల్లెకు రాకుండా ఉండాలని కోరుతూ జోగినీలు కుండలపై ఒంటి కాలిపై నిలబడి భవిష్యవాణి చెప్తున్నారు.

50 ఏండ్ల క్రితం

దాదాపు 50 ఏళ్ల క్రితం పల్లెలను పట్టి పీడిస్తున్న రోగాలు నయం కావాలంటే గ్రామ దేవతలను శాంతింపజేయాల్సిందేనని నిర్ణయించారు. ఇందులో భాగంగా అప్పుడు ప్రతి పల్లెలో ఈ తరహా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి ఊర్లో జనం అంతా కలిసి ఊరు కట్టుబాటు మేరకు జంతువులను బలి ఇచ్చి, గ్రామానికి పొలి పోసి వారం రోజుల పాటు ప్రత్యేక పూజలు చేయించే వారు. తిరిగి ఇఫ్పుడు ఆనాటి ఆనవాయితీని సిరిసిల్ల ప్రాంతంలో అమలు చేస్తున్నారు.



Next Story

Most Viewed