ఆస్పత్రుల్లో గాలి దొరకట్లే.. పది లీటర్లు రూ.20 వేలంట..

by  |
ఆస్పత్రుల్లో గాలి దొరకట్లే.. పది లీటర్లు రూ.20 వేలంట..
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఒక్కరోజులోనే రెట్టింపు సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఆస్పత్రుల్లో బెడ్స్ కూడా సరిపోవడం లేదు. దీంతో పబ్లిక్, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడుతోంది. తాజాగా ఏపీలోని విజయవాడలో స్వచ్చమైన గాలికి తీవ్రమైన కొరత ఏర్పడింది. కరోనా రోగులతో పాటు ఇతర వ్యాధులు, అంబులెన్స్‌లు, హోం ఐసోలేషన్ పేషంట్ల నుంచి ఆక్సిజన్‌కు ఫుల్లు డిమాండ్ వస్తోంది. డిమాండ్కు తగ్గ సప్లయ్ అందుబాటులో లేకపోవడంతో పలు ఏజెన్సీలు అందినకాడికి దండుకుంటున్నాయి. 50 మందికి ఆక్సిజన్ అవసరమైతే బయట 20 మందికి మాత్రమే సరిపడా గాలిని ఏజెన్సీలు సరఫరా చేస్తున్నాయి.

దీంతో ఆక్సిజన్‌కు ధర పెరిగింది. విజయవాడలోని రీఫిల్లింగ్ సెంటర్లు ఐదు కేజీలకు రూ.15వేలు, 10 కేజీలకు రూ.20వేలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆక్సిజన్ అవసరాన్ని కేజీహెచ్ వైద్యులు ముందే గ్రహించారు. దీంతో కేజీహెచ్‌లో ముందస్తు జాగ్రత్తగా 13, 20టన్నుల భారీ ఆక్సిజన్ ట్యాంకులను ఏర్పాటు చేయించారు. ఇదిలాఉంటే, గతేడాది కరోనా ఆస్పత్రులకు 120 టన్నుల ఆక్సిజన్‌ను సప్లయ్ చేసిన విశాఖ స్టీల్ ప్లాంట్ ఈసారి 100 టన్నులకు మించి చేయలేమని చేతులెత్తేసింది. గతంలో లాక్‌డౌన్ వలన బయట ఎవరికి ఆక్సిజన్ సరఫరా చేయకపోవడంతో అంత మొత్తంలో గాలి సరఫరా చేయగలిగామని, ప్రస్తుత సిచువేషన్‌లో వంద టన్నులకు మించి సరఫరా చేయలేమని స్పష్టంచేసింది.


Next Story