పారిశ్రామిక హబ్‌గా షాబాద్.. భారీగా పెరిగిన భూముల ధరలు..ఎకరం 3 కోట్లు!

by  |
shabad-1.
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: గ్రేటర్ హైదరాబాద్‌కు అత్యంత సమీపంలోనున్న షాబాద్ ప్రాంతంలోని చందనవెళ్లి–హైతాబాద్ పారిశ్రామికవాడగా అవతరించడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. కంపెనీల ఏర్పాటుకు అవసరమైన స్థలాలను రాష్ట్ర ప్రభుత్వం అప్పగించడంతో ఉన్నఫలంగా ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. దీనికి తోడు మల్టీనేషనల్ కంపెనీలు కొలువుదీరటంతో ఉద్యోగాలు వెల్లువలా వచ్చిపడతాయని నిరుద్యోగులు ఆనంద డోలికల్లో విహరిస్తున్నారు.

పరిశ్రమలకు వెయ్యి ఎకరాల భూమి సేకరణ…

రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల, షాబాద్ మండలాలు అభివృద్ధికి దూరంగా ఉంది. ఈ ప్రాంతాన్ని ఆర్ధికంగా, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. షాబాద్ మండల పరిధిలోని చందనవెళ్లి, హైతాబాద్ గ్రామాల రెవెన్యూ పరిధిలో ఉన్న 1,128 ఎకరాల భూమిని రైతుల నుంచి ప్రభుత్వం సేకరించింది. సేకరించిన భూమిని రాష్ట్ర ప్రభుత్వం వివిధ కంపెనీలకు కేటాయించింది. ప్రస్తుతం 700 ఎకరాలను టీఎస్ఎస్ఐఐసీ కొనుగోలు చేసి.. వెల్సేషన్, అమేజాన్, కఠారే, కుందన్, టెక్స్‌టైల్ పరిశ్రమలకు కేటాయించినట్లు తెలుస్తోంది. వీటిలో కొన్ని కంపెనీలు నిర్మాణం పూర్తయ్యే దశలో ఉండగా, మరికొన్ని ఇప్పుడే నిర్మాణాలు ప్రారంభించుకున్నాయి. ఈ పరిశ్రమల రాకతో నిరుద్యోగుల చిరకాల స్వప్నం సాకారం కానుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రత్యక్షంగా 3వేల మందికి పైగా పరోక్షంగా మరో 2వేల నుంచి 3వేల మందికి ఉపాధి లభించనున్నట్లు ప్రభుత్వ పెద్దలు వివరిస్తున్నారు.

shabad.2.

పెట్టుబడిన కంపెనీలు ఇవే…

ఈ ప్రాంతంలో రూ.8వేల కోట్లతో ఆరు పరిశ్రమలు నెలకొల్పతున్నారు. రూ.1,100 కోట్లతో వెల్సన్ పరిశ్రమ (హార్డ్ అండ్ సాఫ్టిల్స్, వాల్ కార్పేట్స్) 1,200 మందికి ఉపాధి కల్పిస్తోంది. రూ.213.41 కోట్లతో చేపట్టిన వెల్సషన్ ఫ్లోరింగ్ పరిశ్రమ త్వరలో అందుబాటులోకి రానుంది. రూ.344.75 కోట్లతో వెల్సషన్ ఫ్లోరింగ్ పరిశ్రమలు నెలకొల్పారు. రూ.315.81 కోట్లతో కఠేరా పరిశ్రమ, రూ.202.48 కోట్లతో కుందన్ టెక్నోటెక్స్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు. రూ.5,816.28 కోట్లతో అమేజాన్ డేటా సర్వీస్ 95 మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇక్కడ మల్టీనేషనల్ కంపెనీలను సైతం తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.

పెరిగిన భూ విలువ…

చందనవెళ్లి-హైతాబాద్ పరిసరాల్లో పరిశ్రమలు నెలకొల్పుతుండడంతో ఇక్కడి భూములకు రెక్కలొచ్చాయి. గతంలో ఎకరం భూమి తక్కువలో రూ.10లక్షల నుంచి రూ.20 లక్షల వరకు పలికేది. ప్రస్తుతం పరిశ్రమల ఏర్పాటుతో రూ.3 కోట్లకు పలుకుతోంది. చుట్టుపక్కల వ్యవసాయ పొలాలను ఇతర కంపెనీలు కొనుగోలు చేసి పరిశ్రమల ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నాయి.


Next Story

Most Viewed