కాలం చెల్లిన స్వీట్స్ అమ్మకం.. పట్టించుకోని అధికారులు

by  |
కాలం చెల్లిన స్వీట్స్ అమ్మకం.. పట్టించుకోని అధికారులు
X

దిశ, అశ్వాపురం: స్వీట్స్ ఇష్టపడని వారు ఎవరుంటారు. కలాకండ్ , గులాబ్ జామున్, లడ్డు, జిలేబి ఇలా ఎన్నో రకాల స్వీట్లు చూడగానే నోరూరగ మానదు. కానీ మనం కొనే స్వీట్స్ ప్రతీసారి బాగుంటాయని చెప్పలేం. ఎందుకంటే వాటిపై ఎక్స్పైరి తేదీ ఉండదు. ఈ క్రమంలో ప్రజలు ఒక్కోసారి కాలపరిమితి దాటిన స్వీట్లను కొనుగోలు చేసి రోగాల బారిన పడుతున్నారు. అందుకనే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ప్రతీ స్వీట్ పై తయారీ, ఎక్స్ పైరి తేదీని ముద్రించాలనే నిబంధన విధించింది.

మండలంలో నిబంధనలకు విరుద్దంగా పుట్టగొడుగుల్లా బేకరి, హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు వెలిశాయి. ముఖ్యంగా కొంతమంది బేకరీ షాపుల యజమానులు తయారు చేస్తున్న స్వీట్లు, కేకులకు ఎటువంటి తయారీ, ఎక్స్ పైరి తేదీలు ప్రకటించకుండా పాచిపోయిన పదార్ధాలు సైతం బేకరీల్లో అందమైన విద్యుత్ దీపాలతో అలంకరించిన ప్రత్యేకమైన షోకేజ్ లలో ఉంచి నాణ్యత ప్రమాణాలు లేకుండా వాటి విక్రయాలు కొనసాగిస్తున్నారు. అట్టి పదార్ధాలు కొనుగోలు చేసిన వినియోగదారులు రుచి చూసి ఇదేమిటని ప్రశ్నిస్తే వారిపై బేకరీల యజమానులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. మణుగూరు భారజల కర్మాగారంలో పని చేసే ఉద్యోగులంతా మండల కేంద్రమైన గౌతమి నగర్ కాలనీ లో నివసిస్తారు. కాలనీలో నివాసం ఉండే ఉద్యోగులు వివిధ రాష్ట్రాలకు చెందిన వారు కావడంతో ప్రతీ శుభకార్యాలకు స్వీట్స్, కేకులను కొనుగోలు చేస్తారు. వీరికి తోడు చుట్టుపక్కల గ్రామాల పిల్లలు, పెద్దలు సైతం కేకులు, ఫాస్ట్ ఫుడ్ అంటే ఇష్టపడుతుంటారు.

దీంతో అశ్వపురంలో కేకులకు, స్వీట్లకి గిరాకీ భాగానే ఉంటుంది. ఓ అశ్వాపురంలో కుప్పలు తెప్పలుగా బేకరీ షాపులు వెలుస్తున్నాయి. ఒక్క బేకరీ కూడా నాణ్యత ప్రమాణాలు, నిబంధనలు పాటించడం లేదు. కూల్ కేకుల పేరుతో రోజుల తరబడి నిల్వ ఉంచిన పాచిపోయిన కేకులను వినియోగదారులకు అంటకడుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే నాణ్యత ప్రమాణాలు లేకుండా జరిగే స్వీట్లు, కేకులు అమ్మకాలకు అశ్వాపురం మండల కేంద్రం “ఫేమస్” గా చెప్పుకోవచ్చు. ఇలా విక్రయిస్తున్న పదార్ధాలు తినడం వల్ల పిల్లలు, పెద్దలు అనారోగ్యాల పాలవుతున్నారు. బేకరీ యజమానులు తయారు చేస్తున్న పదార్ధాలపై తయారీ తేదీ కానీ, కాలం చెల్లిన తేదీ కానీ ఉండవు. సంబంధిత బేకరీ యజమానులు తయారు చేసింది మొదలు అమ్ముడు పోయేవరకు ఉండి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.

ప్రజల ఆరోగ్యం ఏమైనా వారికి సంబంధం లేదు. అడ్డగోలుగా సరుకు అమ్ముతూ ప్రభుత్వానికి ఎటువంటి పన్నులు చెల్లించడం లేదనే ఆరోపణలున్నాయి. ఇంత జరుగుతున్నా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటు వైపు కన్నెతైనా చూడకపోవడంతో ఆ శాఖ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్ని బేకరీ షాపులకు అనుమతులు ఉన్నాయన్న విషయం కూడా అధికారులకు స్పష్టత లేదన్న ఆరోపణలున్నాయి. ఆహార భద్రత అధికారులతో పాటు గ్రామ పంచాయితీ అధికారులు ఇకనైనా మేల్కొని అశ్వాపురం తినుబండారాలకు సంబంధించిన దుకాణాలను పరిశీలించి నాణ్యత ప్రమాణాలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story

Most Viewed