కొండగట్టు అంజన్న సన్నిధిలో వ్యభిచార దందా..?

by Anukaran |
కొండగట్టు అంజన్న సన్నిధిలో వ్యభిచార దందా..?
X

దిశ, మల్యాల : విలాసాలకు, జల్సాలకు అలవాటైన కొంతమంది కష్టపడకుండా సులభంగా డబ్బులు సంపాదించాలనే అత్యాశతో వక్ర మార్గాలను ఎంచుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం రాష్ట్రంలోనే ప్రసిద్ధి గాంచినది. నిత్యం వేల సంఖ్యలో భక్తులు అంజన్న దర్శనం కోసం కొండగట్టు పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తుంటారు. హనుమాన్ దర్శనం చేసుకున్నాక దిగువ కొండగట్టుకు చేరుకొని ఇతర ఆలయాలను సందర్శించి వెళ్తుంటారు. అలాంటి సుప్రసిద్ధ ఆలయ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా కొందరు అక్రమార్కులు కొండ కింద వ్యభిచార కేంద్రాలు నిర్వహిస్తూ ఆలయ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు.

భక్తులే టార్గెట్..?

కొండపైన అద్దెకు రూములు సరిగా లేకపోవడం, భక్తుల రద్దీ కారణంగా భక్తులు ఆశ్రయం కోసం దిగువ కొండగట్టులో ప్రైవేట్ లాడ్జీలు, అద్దె గదులను ఆశ్రయిస్తున్నారు. అమాయకమైన భక్తులను టార్గెట్‌గా చేసుకుని ఓ వ్యభిచార ముఠా పవిత్ర పుణ్యక్షేత్రంలో అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్నట్టు తెలిసింది. కొంతమంది అద్దె గదుల నిర్వాహకులతో కలిసి విచ్చలవిడిగా వ్యభిచార కేంద్రాలు నిర్వహిస్తున్నారు. వేరే ప్రదేశం నుంచి తీసుకువచ్చిన అమ్మాయిలతో వ్యభిచార దందా సాగిస్తూ మొబైల్ ఫోన్లు, వాట్సాప్‌ల ద్వారా యువతకు గాలం వేస్తున్నారు. తమ దగ్గరికి వచ్చిన యువత, భక్తుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు.

పర్మిషన్ ఉన్న లాడ్జిలు ఎన్ని..?

దిగువ కొండగట్టలో ఇబ్బడిముబ్బడిగా అద్దెకు రూములు వెలుస్తున్నాయి. వీటిలో అన్నింటికీ అనుమతులు ఉన్నాయా? అనుమతులు లేకుండానే నిర్వహిస్తున్న లాడ్జిలు ఎన్ని ఉన్నాయి.. అన్ని అద్దె రూములలో లాగిన్ రిజిస్టర్ల నిర్వహణ ఉందా..? అద్దెకు వచ్చే వారి నుంచి గుర్తింపు కార్డు కాపీని జతపరుస్తున్నారా? అని పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. గతంలోనూ ఇటువంటి ఘటనలు జరిగిన రోజులున్నాయి. అధికారులు అనుమతులు లేని అద్దె రూముల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కొందరు భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

రైడింగ్‌లో దొరికిన వ్యభిచార ముఠా..

గతవారం పోలీసులు ఆకస్మికంగా దిగువ కొండగట్టులోని పలు అద్దె గదుల్లో నిర్వహించిన సోదాల్లో ఒక విటుడుతో పాటు ఇద్దరు మహిళలు వ్యభిచారం చేస్తూ పట్టుబడిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. వీరితో పాటు లాడ్జి నిర్వాహకుడిని కూడా అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 15,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్టు మల్యాల ఎస్సై మంద చిరంజీవి తెలిపారు.

అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తే కఠిన చర్యలు..

సరైన అనుమతులు లేకుండా అద్దె గదులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటాం. ప్రతి లాడ్జిలో తప్పనిసరిగా లాగిన్ రిజిస్టర్ ఉండాలి. అద్దెకి వచ్చే ప్రతి ఒక్కరీ వివరాలు రిజిస్టర్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలి. రూమ్‌లో ఉండే వారందరీ ఐడి ప్ర్రూఫ్‌లను జతపరచాలి. అద్దె రూములలో మద్యం తాగడం, పేకాట ఆడటం, అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తే వారితో పాటు లాడ్జి యజమానిపై కూడా కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటాం.

-మల్యాల ఎస్సై మంద చిరంజీవి

Next Story