కేసీఆర్ నోటి వెంట కొత్త నినాదం!

by Disha Web Desk |
కేసీఆర్ నోటి వెంట కొత్త నినాదం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. వరంగల్ టూర్‌లో ఆయన నరేంద్ర మోడీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజకీయాల కోసం కేంద్ర మంత్రులు వచ్చి తిట్టిపోతున్నారు.. ఆ మరుసటి రోజే ఢిల్లీలో తెలంగాణకు అవార్డులు ఇస్తున్నారని ఫైర్ అయ్యారు. త్వరలో జాతీయ పార్టీపై కీలక ప్రకటన చేయబోతున్న నేపథ్యంలో కేసీఆర్ వరంగల్ స్పీచ్‌కు ప్రాధాన్యత ఏర్పడింది. అయితే ఈ స్పీచ్‌లో సీఎం కేసీఆర్ ఇచ్చిన సరికొత్త నినాదం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. సీఎం కేసీఆర్ స్పీచ్ లో మాట్లాడే ప్రతి పదం వెనుక తనదైన వ్యూహం ఉంటుందనే ప్రచారం ఉంది.

ఉద్యమ సమయంలోనూ ఆయన ఎత్తుకున్న నినాదాలు ప్రజల్లోకి దావనంలో చొచ్చుకుపోయాయి. తన ప్రసంగం ముగించే ప్రతిసారి జై తెలంగాణ అనే నినాదం చేయడం కేసీఆర్ ఆనవాయితీగా వస్తోంది. తాను నినదించడమే కాదు సభికులందరి చేత ఆయన జై తెలంగాణ నినాదం చేయిస్తారు. అయితే నేషనల్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న వేళ కేసీఆర్ నోటి వెంట కొత్త నినాదాలు వినిపించడం చర్చనీయాంశంగా మారుతున్నాయి. తాజాగా శనివారం జరిగిన వరంగల్ సభలో కేసీఆర్ తన ప్రసంగాన్ని ముగిస్తూ జై తెలంగాణ అనే నినాదంతో పాటు జై భారత్ అంటూ నినాదం ఇవ్వడం ఆసక్తిగా మారింది. గత నెలలో హైదరాబాద్‌లో జరిగిన ఆదివాసీ, బంజారాల ఆత్మీయ సదస్సులోనూ కేసీఆర్ అనూహ్య నినాదం చేశారు. ఆ సభ ముంగిపులో జై హింద్.. జై తెలంగాణ అంటూ కేసీఆర్ తన ప్రసంగాన్ని ముంగించడం చర్చనీయాంశంగా మారింది.

2021లో దళిత బంధు స్కీమ్ ప్రారంభోత్సవం సమయంలోనూ కేసీఆర్ జై భీమ్ అనే నినాదం చేశారు. కేసీఆర్ చేసిన నినాదంపై అప్పట్లోనే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దళిత కార్డు ఉపయోగించుకుని కేసీఆర్ దేశ రాజకీయాలపై దృష్టి పెట్టారా అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. ఈ నెల 5వ తేదీన జాతీయ రాజకీయాలపై కీలక ప్రకటన చేయబోతున్న నేపథ్యంలో కేసీఆర్ నోటి వెంట జై భారత్, జై హింద్ అనే నినాదాలు చేయడం వెనుక భారీ రాజకీయ వ్యూహం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. గతంలో హిందువులపై కేసీఆర్ చేసిన కామెంట్స్ టీఆర్ఎస్ పార్టీకి ఏ మేరకు డ్యామేజ్ చేసిందో అందరికీ తెలిసిన విషయమే. తాను పెట్టబోయే కొత్త పార్టీకి హిందూ వ్యతిరేక మచ్చ ఉండకూడనే వ్యూహంలో భాగంగానే కేసీఆర్ జై భారత్, జై హింద్ నినాదాలు ఎత్తుకుంటున్నారనే విమర్శలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

'మా పనైపోయింది'.. వరంగల్ సభలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు


Next Story

Most Viewed