అమిత్‌షాపై భ‌ట్టి ఫైర్..

by Disha Web Desk 11 |
అమిత్‌షాపై భ‌ట్టి ఫైర్..
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: మైనార్టీల రిజర్వేషన్ రద్దు చేస్తానని వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమీత్ షాపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. పీపుల్స్ మార్చ్ లో భాగంగా సోమవారం భట్టి విక్రమార్క హన్మకొండ జిల్లా కమలాపూర్‌, ఎల్కతుర్తి, వ‌ర్ధన్నపేట మండ‌లాల్లో పర్యటించారు. ముందుగా క‌మ‌లాపూర్‌లో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను భట్టి పరిశీలించారు. అనంతరం ఆయన విలేక‌రుల‌తో మాట్లాడారు. ప్రశాంతంగా ఉన్న దేశంలో, మాన‌స స‌రోవ‌రం లాంటి తెలంగాణ రాష్ట్రంలో మత కల్లోలం సృష్టించడానికి బీజేపీ కుట్రలు చేస్తోంద‌ని అమిత్ షా చేసిన వ్యాఖ్యల‌ను ఉద్దేశించి అన్నారు. ముస్లిం రిజర్వేషన్లపై ఆయన చేసిన ప్రకటనతో మత కల్లోలాలకు దారి తీసే ప్రమాదం పొంచి ఉంద‌న్నారు.

భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన ఒక మతానికి వ్యతిరేకంగా మాట్లాడడం బాధాకరమ‌న్నారు. ‘రాజ్యాంగం ఇచ్చిన వెసులుబాటుతో ప్రభుత్వం ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చింది. రాజ్యాంగం ఇచ్చిన వాటిని తొలగిస్తానని ఒక కేంద్ర మంత్రి చెప్పడం దారుణం. అది రాజ్యాంగ ఉల్లంఘనకే దారి తీస్తుంది. ముస్లిం రిజర్వేషన్లపై మాట్లాడి గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలతో ప్రశాంతంగా ఉన్న దేశంతోపాటు తెలంగాణలో అల్లర్లు సృష్టించే కుట్రలు చేస్తున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వారి ఆటలు సాగవు’ అని హెచ్చరించారు. అదే స‌మ‌యంలో పంట నష్టంపై స్పందిస్తూ సీఎం కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

నష్టపోయిన రైతులకు పరిహారం ఇస్తాం అంటున్నారు కానీ క్షేత్రస్థాయిలో అధికారులు రాలేదన్నారు. మొక్కజొన్నకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదన్నారు. మార్క్ ఫెడ్ నుంచి కొనుగోళ్లు చేయకపోవడంతో రైతులకు నష్టం జరుగుతోందన్నారు. సమావేశంలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి, ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్, కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జి దొమ్మాటి సాంబయ్య, కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి, పీసీసీ జనరల్ సెక్రెటరీలు కోట నీలిమ, బీర్ల ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed