పరిటాల శ్రీరామ్‌ను అడ్డుకున్న పోలీసులు.. ధర్మవరంలో హైటెన్షన్

by Mahesh |   ( Updated:2023-10-26 05:39:25.0  )
Paritala Shriram
X

దిశ, ఏపీ బ్యూరో: అనంతపురం జిల్లా ధర్మవరంలో ఉద్రిక్తత నెలకొంది. పింఛన్ల తొలగింపును నిరసిస్తూ ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నాకు టీడీపీ యువనేత పరిటాల శ్రీరామ్ పిలుపునిచ్చారు. అందులో భాగంగా సోమవారం ఉదయం తన నివాసం నుంచి ధర్నాలో పాల్గొనేందుకు పరిటాల శ్రీరామ్ బయలుదేరారు. అయితే ధర్మవరం మండలం ప్యాదిండి వద్ద పోలీసులు పరిటాల శ్రీరామ్‌ను అడ్డుకున్నారు. ధర్నాకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. పోలీసులు అడ్డుకోవడంతో టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ధర్మవరంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది.

ఉద్రిక్తతల నడుమ మాజీ మంత్రి పరిటాల సునీత, ధర్మవరం నియోజకవర్గ ఇన్‌చార్జ్ పరిటాల శ్రీరామ్‌లు ర్యాలీగా ఆర్డీవో కార్యాలయం వద్దకు వెళ్లారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి మాజీమంత్రి పరిటాల సునీత, పల్లె రఘునాథ్ రెడ్డి తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్లు ఇవ్వడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. రూ.3వేల వరకు పెంచుకుంటూ పోతామని ప్రమాణ స్వీకారం నాడు చెప్పిన సీఎం జగన్ రెండున్నరేళ్లు అయినప్పటికీ ఇప్పటికీ 2,250 మాత్రమే ఇస్తున్నారని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు.

Next Story

Most Viewed