పసి నవ్వులకు ప్రాణం పోసిన డాక్టర్.. 37 వేల ఉచిత సర్జరీలు

by  |
పసి నవ్వులకు ప్రాణం పోసిన డాక్టర్.. 37 వేల ఉచిత సర్జరీలు
X

దిశ, ఫీచర్స్ : ఒకరికి ఇవ్వడంలో ఉన్న సంతృప్తి, సాయం చేయడంలో ఉన్న సంతోషం ఇంకెందులోనూ ఉండదని కొందరు నమ్ముతారు. అలాగే తన ఉన్నతికి కారణమైన సమాజానికి ఎంతో కొంత తిరిగివ్వాలని కోరుకుంటారు. అలాంటి తత్వమున్న కొందరిలో డాక్టర్ సుబోధ్ సింగ్ ఒకరు. వారణాసికి చెందిన సుబోధ్ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు. దాంతో స్కూల్ నుంచి తిరిగొచ్చాక గాగుల్స్, సబ్బులు అమ్ముతూ కుటుంబానికి ఆర్థికంగా సాయపడేవాడు. ఇలా పార్ట్‌టైమ్ పనులు చేస్తూనే వైద్యవిద్య పూర్తిచేసిన ఆయనది ఎంత ఎదిగినా ఒదిగుండే స్వభావం. ఈ క్రమంలోనే సామాజిక బాధ్యతతో ‘క్లెఫ్ట్ పాలెట్(చీలిక పెదవి/అంగిలి)’తో పుట్టిన పిల్లలకు 37,000 శస్త్రచికిత్సలు ఉచితంగా చేసి 25,000 కుటుంబాల్లో చిరునవ్వులు నింపారు.

రైల్వే క్లర్క్ పనిచేసే సుబోధ్ తండ్రి 1979లో మరణించడంతో కుటుంబం ఆర్థిక కష్టాల్లో చిక్కుకుంది. దీంతో ఇల్లు గడిచేందుకు తన సోదరుడితో కలిసి ఇంట్లో తయారుచేసిన సబ్బులను విక్రయించేవారు. ఇలాంటి పరిస్థితుల నడుమ మెడికల్ ఎంట్రెన్స్ టెస్టులకు సిద్ధమైన సుబోధ్.. సాయుధ దళాల వైద్య కళాశాల(AFMC-పుణె), BHU-PMT, UP స్టేట్ కంబైన్డ్ ప్రీ మెడికల్ టెస్ట్(CPMT) మూడు మెడికల్ ప్రవేశ పరీక్షల్లోనూ ఉత్తీర్ణత సాధించారు. ఇక వైద్య విద్య పూర్తిచేసిన తర్వాత ఆర్థిక కష్టాలు తీరిపోయాయి.

చిరునవ్వుల ప్రయాణం..

పేదలకు సాయపడాలన్న తండ్రి మాట ప్రకారం.. ప్రతీ ఏటా ఆయన వర్ధంతి రోజున ఉచితంగా శస్త్రచికిత్సలు చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో 2003-04 నుంచి క్లెఫ్ట్ పాలెట్ శస్త్రచికిత్సలు చేస్తూ ‘ది స్మైల్ ట్రైన్’(ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద క్లెఫ్ట్ పాలెట్ శస్త్రచికిత్స-కేంద్రీకృత సంస్థ) ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. ఈ బృందం సహకారంతో 2005 చివరి నాటికి 500 ఉచిత శస్త్రచికిత్సలు చేసిన సుబోధ్.. మరుసటి ఏడాదికి 2,500 పూర్తిచేశాడు. ఇక 2008-09 నుంచి ఏటా 4,000కు పైగా ఉచిత శస్త్రచికిత్సలు చేస్తున్నారు. అంతేకాకుండా ప్లాస్టిక్ సర్జన్లు, సామాజిక కార్యకర్తలు, పోషకాహార నిపుణులు, స్పీచ్ థెరపిస్టుల బృందంతో దేశవ్యాప్తంగా.. ముఖ్యంగా తూర్పు, ఈశాన్య భారతంలో క్లెఫ్ట్ పాలెట్‌తో బాధపడుతున్న పిల్లలను ట్రాక్ చేసేందుకు ఔట్‌రీచ్ ప్రోగ్రామ్‌‌ను సుబోధ్ సిద్ధం చేశారు.

ప్రేరణ..

‘స్మైల్ ట్రైన్ ప్రాజెక్ట్ 2008’లో మేగన్ మైలాన్‌ రూపొందించిన 39 నిమిషాల డాక్యుమెంటరీ.. ‘స్మైల్ పింకీ(2008)’ని రూపొందించేందుకు ప్రేరణనిచ్చింది. ఇది ఉత్తమ షార్ట్ డాక్యుమెంటరీ విభాగంలో ఆస్కార్‌ను గెలుచుకుంది. ఫిబ్రవరి 2009లో USలో జరిగిన అకాడమీ అవార్డ్స్ వేడుకలో పింకీ, డాక్టర్ సుబోధ్ ఇద్దరూ ఈ చరిత్రాత్మక సన్నివేశానికి సాక్షులుగా ఉన్నారు. సుబోధ్ అండ్ టీమ్ 6,000 బర్న్ సర్జరీలను కూడా ఉచితంగా నిర్వహించి తీవ్రంగా కాలిన గాయాలతో బాధపడుతున్న వారి జీవితాల్లో సంతోషాన్ని నింపారు. కాగా సుబోధ్ ప్రయత్నాలు నేషనల్ జియోగ్రాఫిక్ డాక్యుమెంటరీ ‘బర్న్డ్ గర్ల్ (2015)’ రూపకల్పనకు ప్రేరణనిచ్చాయి. తొమ్మిదేళ్ల బాలిక రాగిణి జీవితాన్ని వివరించిన ఈ డాక్యుమెంటరీ అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది.

Next Story

Most Viewed