కేటీఆర్ చెప్పారు.. నవంబర్ 15న ప్రజలెవరూ ప్రయాణాలు పెట్టుకోవొద్దంట

by  |
ktr-12
X

దిశ, వెబ్ డెస్క్: పార్టీ ద్విదశాబ్ధి ఉత్సవాలకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయని, నియోజకవర్గాల సన్నాహక సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ 93 శాతం పూర్తయ్యిందని, కరోనా ప్రభావం తగ్గడంతో పార్టీ కార్యక్రమాల్లో జోరు పెంచామని, తొమ్మిది నెలల పాటు రకరకాల పార్టీ కార్యక్రమాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ ను ప్రతిపాదిస్తూ ఇప్పటికే పది సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయని, పార్టీ ముఖ్య నాయకుల సమావేశం ఈ నెల 24న తెలంగాణ భవన్ లో ఉంటుందని ఆయన తెలిపారు. ఈ నెల 25 న ప్లీనరీ hitex లో ఘనంగా నిర్వహిస్తామని, 27న వరంగల్ లో నిర్వహించే తెలంగాణ విజయ గర్జన సభ విజయవంతం చేసేందుకు నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు ఉంటాయని కేటీఆర్ తెలిపారు.

‘వరంగల్ లో ఎన్నో సభలు పెట్టి విజయవంతం చేశాం. మాకు వరంగల్ కలిసొచ్చిన ప్రాంతం. తెలంగాణ విజయ గర్జన సభ గొప్ప సభల్లో ఒకటిగా మిగిలి పోతుంది. ఆర్టీసీ బస్సులను ఆరు వేల వరకు వినియోగిస్తున్నాం. గ్రామ పంచాయతీ డివిజన్లు సహా మొత్తం 16 వేల యూనిట్ల నుంచి వాహనాల్లో సభకు జనం వస్తారు. నవంబర్ 15న ప్రజలకు కొంత అసౌకర్యం కలుగుతది. ఆరోజు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కోరుతున్నా. మా పథకాలను కేంద్రం అనుకరించి అమలు చేస్తోంది. ప్రభుత్వానికే ఎక్కువ సమయం వెచ్చించడం వల్ల పార్టీ కార్యక్రమాలు కొంత తగ్గాయి.. ఇపుడు పెంచుతున్నాం. జిల్లా పార్టీ కార్యాలయాల నిర్మాణం తర్వాత శిక్షణా కార్యక్రమాలు ఉంటాయి’ అని ఆయన అన్నారు.

‘హుజురాబాద్ లో వంద శాతం విజయం సాధిస్తాం. నాగార్జున సాగర్ లో జానారెడ్డినే ఓడించాం. రాజేందర్ అంతకన్నా పెద్ద లీడరా?. ఈటల బీజేపీ బురదను అంటించుకున్నారు. ఈటల బీజేపీని సొంతం చేసుకోవడం లేదు. జై ఈటల అంటున్నరు తప్ప జై శ్రీరామ్ అని ఎందుకనడం లేదు. బీజేపీ అంటే ఓట్లు పడవనే ఈటల ఆ పార్టీ పేరు ఎత్తడం లేదు. ఈటలకు టీఆర్ఎస్ ఎంతో చేసింది. రాజేందర్ ఎందుకు రాజీనామా చేశారో ఇప్పటికీ చెప్పడం లేదు. గెలిస్తే ఏం చేస్తాడో చెప్పకుండా వేరే విషయాలు మాట్లాడుతున్నాడు. హుజూరాబాద్ లో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయి’ అని కేటీఆర్ పేర్కొన్నారు.

‘ఈటల, రేవంత్ కుమ్మక్కయ్యారు. హుజురాబాద్ లో కాంగ్రెస్ కు డిపాజిట్ రాదు కానీ, రేవంత్ ముందస్తు ఎన్నికల గురించి చిలక జోస్యం చెబుతున్నాడు. బలమైన అభ్యర్థిని కావాలనే కాంగ్రెస్ బరిలోకి దింపలేదు. పీసీసీ అధ్యక్షుడు అయ్యాక తనను తాను నిరూపించుకోవాలి కదా.. ఎందుకు హుజురాబాద్ వెళ్లడం లేదు. కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్న సన్నాసి ఎందుకు చేయలేదు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమే. పశ్చిమ బెంగాల్ లో మమత గెలిస్తే మోడీ దుప్పటి కప్పుకుని పడుకున్నాడా?. తాను గెలిస్తే కేసీఆర్ అసెంబ్లీకి రావొద్దని రాజేందర్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ లో భట్టిది నడవడం లేదు.. గట్టి అక్రమార్కులది నడుస్తోంది. దళిత బంధును కొన్ని రోజులు ఆపగలరేమో.. నవంబర్ 3 తర్వాత ఆపగలుగుతారా?.
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం సమయం సందర్భం ఉంటుంది. నేను వేరేవారి లాగా చిలుక జోస్యం చెప్పలేను. ఉద్యమకారులు అసంతృప్తిగా ఉంటే ఇన్ని ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎందుకు గెలుస్తది. ప్రజా ఆలోచనకు హుజురాబాద్ ఉపఎన్నిక ఖచ్చితంగా ప్రతిబింబమే’ అని మంత్రి పేర్కొన్నారు.

‘నవంబర్ 15 తర్వాత నాతోపాటు కొంత మంది టీఆర్ఎస్ నేతలు తమిళనాడు వెళ్తున్నాం. అన్నా dmk పార్టీ సంస్థాగత నిర్మాణం పరిశీలిస్తాం. కేసీఆర్ ఎంతో మంది లీడర్లను తయారు చేశారు. పార్టీలో ఎన్నో దారులు ఉంటాయి. స్వాతంత్ర పోరాటంలో ఎంతోమంది భిన్న దారుల్లో పోరాడి కాంగ్రెస్ లో చేరలేదా. కేసీఆర్ ఉపరాష్ట్రపతి అనేది వాట్సాప్ యూనివర్సిటీ ప్రచారం. టీఆర్ఎస్ లో నియోజక వర్గాల్లో గ్రూపులు పార్టీ బలంగా ఉందనడానికి నిదర్శనం. అన్నిటినీ అధిగమిస్తాం. నియోజకవర్గ నేతలతో జరుగుతున్న మీటింగుల్లో వచ్చిన ఫీడ్ బ్యాక్ ను కేసీఆర్ కు తెలియజేస్తాం. నేను హుజురాబాద్ ప్రచారానికి వెళ్లడం లేదు. నాగార్జున సాగర్ దుబ్బాకకు కూడా వెళ్లలేదు. సీఎం ప్రచారం కూడా ఇంకా ఖరారు కాలేదు. రేవంత్, ఈటల తదితరులు టీఆర్ఎస్ పై కుట్రకు తెరలేపారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ ఈటెలకు ఓటెయ్యాలని లేఖ రాయడం ఏమిటీ. హుజురాబాద్ ఖచ్చితంగా చిన్న ఎన్నిక. టీఆర్ఎస్ విజయాలు మీడియాకు కనిపించవు. ఎన్టీఆర్ పెట్టిన టీడీపీ.. కేసీఆర్ పెట్టిన టీఆర్ఎస్ లే ముందుకు సాగుతున్నాయి’ అని కేటీఆర్ అన్నారు.


Next Story

Most Viewed