నీట్ రీ-ఎగ్జామ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

by Kema Shiva Kumar |

జూన్ 21న జరగబోయే ‘నీట్’ రీ-ఎగ్జామ్‌కు అన్ని రకాల సైబర్ రక్షణ, దర్యాప్తు సంస్థల నిఘాతో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.

నీట్ రీ-ఎగ్జామ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా జూన్ 21న జరగబోయే నీట్(NEET) రీ-ఎగ్జామ్‌కు సంబంధించి అత్యంత పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) వెల్లడించారు. పరీక్షల నిర్వహణ తీరు, భద్రతా ఏర్పాట్లను సమీక్షించేందుకు ఆయన స్వయంగా ఇవాళ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. క్వశ్చన్ పేపర్ తయారీ నుంచి పరీక్షా కేంద్రాలకు వాటిని సురక్షితంగా చేరవేసే వరకు ప్రతీ దశలోనూ కాన్ఫిడెన్షియల్‌గా వ్యవహరించేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. పేపర్ లీకేజీలు, ఇతర అక్రమాలను అరికట్టేందుకు ఇంటెలిజెన్స్ బ్యూరో, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో పాటు అందుబాటులో ఉన్న అన్ని సైబర్ రక్షణ వనరులను తాను వినియోగిస్తున్నామని ప్రకటించారు.

ఉన్నతాధికారుల పర్యవేక్షణ..

కేబినెట్ సెక్రటరీ నేతృత్వంలో నీట్ రీ-ఎగ్జామ్‌పై ఇప్పటికే సంబంధిత శాఖల కార్యదర్శుల సమావేశం జరిగింది. త్వరలోనే కేంద్ర హోం సెక్రటరీ కూడా దీనిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నట్లుగా ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. పరీక్షల నిర్వహణ సంస్థను మరింత బలోపేతం చేసేందుకు వీలుగా ఎన్‌టీఏలో పలు మార్పులు చేశామని పేర్కొన్నారు. జాయింట్ సెక్రటరీలు, డైరెక్టర్ల స్థాయితో పాటు పలువురు కొత్త అధికారులను నియమించామని, పాత, కొత్త అధికారులందరికీ స్పష్టమైన బాధ్యతలను అప్పగించామని అన్నారు. అదేవిధంగా పరీక్షల సజావుగా నిర్వహణ కోసం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశామని.. గతంలో కంటే ఈసారి మరింత ఎక్కువ శ్రద్ధ వహించాలని వారిని కోరినట్లుగా ఆయన తెలిపారు. విద్యార్థులంతా ఎలాంటి ఆందోళన చెందకుండా కేవలం తమ చదువుపైనే శ్రద్ధ పెట్టాలని. రాబోయే రీ-ఎగ్జామినేషన్‌ను ఎలాంటి లోపాలు లేకుండా, అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తామని ధర్మేంద్ ప్రధాన్ భరోసానిచ్చారు.

Next Story