ఈసీల నియామకంపై తీసుకొచ్చిన చట్టంపై స్టే విధించమన్న సుప్రీంకోర్టు

by Shamantha N |
ఈసీల నియామకంపై తీసుకొచ్చిన చట్టంపై స్టే విధించమన్న సుప్రీంకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్నికల కమిషనర్ల నియామకంపై తీసుకొచ్చిన చట్టంపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈసీ నియామకంపై విచారించేందుకు రెండోసారి నిరాకరించింది. కాగా.. ఈ అంశంపై పెండింగ్ లో ఉన్న కేసుల జాబితాను ఈ పిటిషన్ కు అటాచ్ చేసింది. సార్వత్రిక ఎన్నికలకు ముందే ఏప్రిల్ లో వీటన్నింటిపై విచారణ జరపాలని ఆదేశించిది. మరోవైపు దీనిపై సమాధానం ఇవ్వాలని కేంద్రానికి మరోసారి నోటీసులు జారీ చేసింది.

అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ తరఫున ప్రశాంత్ భూషణ వాదనలు వినిపించారు. ఎన్నికల కమిషనర్లలో ఒకరైన అనూప్ చంద్ర పాండే పదవీవిరణ చేయనున్నారని.. అందుకే ఈ చట్టాన్ని నిషేధించాలని కోరారు. మధ్యంతర స్టే విధించలేమని.. రాజ్యాంగ చెల్లుబాటుకు సంబంధించిన అంశం ఎప్పటికీ పనికిరానిది కాదని స్పష్టం చేసింది జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం.

గతంలో కొత్త చట్టంపై స్టే కోరారు కాంగ్రెస్‌ నాయకురాలు జయ ఠాకూర్‌. కేంద్రం తీసుకువచ్చిన చట్టం అధికార విభజనకు విరుద్ధమని తెలిపారు. ఈ చట్టంపై స్టే విధించాల్సిందిగా కోరారు. అయితే.. కేంద్రం వాదనలు వినకుండా స్టే విధించలేదమని తెలుపుతూ ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. పిటిషన్‌ కాపీని కేంద్రం తరఫు న్యాయవాదికి అందజేయాల్సిందిగా ధర్మాసనం కోరింది.

ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్లలను ఎన్నుకునే అధికారం కలిగిన ప్యానెల్ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించడంపై రాజకీయంగా దుమారం రేగింది.దీని ప్రకారం ప్రధాన మంత్రి, ప్రతిపక్ష నాయకుడు, కేబినెట్ సభ్యునితో కూడిన స్వతంత్ర ప్యానెల్ ఎన్నికల కమిషనర్లను నియమిస్తుంది. ఈ చట్టం ఎన్నికల కమిషనర్ల నియామకంలో సుప్రీంకోర్టు పాత్రను తొలగించింది. సీఈసీలు, ఈసీలపై క్రిమినల్ చర్యలు తీసుకునే అధికారం నుంచి సుప్రీంకోర్టును తప్పించింది.



Next Story

Most Viewed