40 ఏళ్ల ‘హత్య కేసు’.. అలహాబాద్ హైకోర్టుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం!

by Malleboina Mahesh |

హత్య కేసులో 40 ఏళ్లుగా అప్పీల్ పిటిషన్ పెండింగ్‌లో ఉంచడంపై అలహాబాద్ హైకోర్టుపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది.

40 ఏళ్ల ‘హత్య కేసు’.. అలహాబాద్ హైకోర్టుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం!
X

దిశ, వెబ్ డెస్క్: 40 ఏళ్ల ‘హత్య కేసు’ విషయంలో అలహాబాద్ హైకోర్టుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. దేశంలోని న్యాయవ్యవస్థలో కేసుల పెండింగ్, విచారణలో జరుగుతున్న అసాధారణ ఆలస్యంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) ఈ కేసు విచారణ సందర్భంగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఒక హత్య కేసు నిందితుడు తన శిక్షను సవాలు చేస్తూ దాఖలు చేసిన క్రిమినల్ అప్పీల్ అలహాబాద్ హైకోర్టులో ఏకంగా 40 ఏళ్లుగా పెండింగ్‌లో ఉండటంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సోమవారం ఈ కేసును విచారించిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎ.ఎస్. చందూర్కర్లతో కూడిన బెంచ్.. ఈ సుదీర్ఘ ఆలస్యం చాలా కలవరపరిచేలా ఉందంటూ అభివర్ణించింది.

40 ఏళ్ల నాటి కేసు.. ఇప్పటికీ తేలని తీర్పు..

ఈ కేసు వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన విజయ్ సింగ్ అనే వ్యక్తి తన సోదరుడిని తుపాకీతో కాల్చి చంపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఆయన నవంబర్ 1983లో అరెస్ట్ అయ్యారు. అప్పట్లో ఆయన వయస్సు కేవలం 28 ఏళ్లు మాత్రమే. విచారణ అనంతరం కోర్టు అతడిని దోషిగా తేల్చగా.. ఆ శిక్షను సవాలు చేస్తూ అలహాబాద్ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. అయితే, నాటి నుండి నేటి వరకు (దాదాపు 40 ఏళ్లుగా) ఈ అప్పీల్ పిటిషన్ అలహాబాద్ హైకోర్టులోనే నలుగుతోంది. ఈ తరహా విపరీతమైన ఆలస్యం వల్ల న్యాయ వితరణ వ్యవస్థకే తీరని నష్టం జరుగుతోందని సుప్రీంకోర్టు బెంచ్ పేర్కొంది. అలహాబాద్ హైకోర్టులో కొండలా పేరుకుపోతున్న ఇటువంటి పాత కేసుల పెండింగ్‌ను తగ్గించడానికి, న్యాయవ్యవస్థను గాడిలో పెట్టడానికి ఎలాంటి వినూత్నమైన, నూతన మార్గాలను (Innovative Measures) అవలంబించవచ్చో సూచించాల్సిందిగా సుప్రీంకోర్టు కోరింది.

Next Story