ముస్లింలు, క్రైస్తవులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాందేవ్ బాబా

by Disha Web Desk 7 |
ముస్లింలు, క్రైస్తవులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాందేవ్ బాబా
X

దిశ, డైనమిక్ బ్యూరో : ప్రముఖ యోగా గురువు, పతంజలి వ్యాపారవేత్త రాందేవ్ బాబా మరో వివాదానికి తెరతీశారు. ముస్లింలు, క్రైస్తవులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నమాజ్ పేరుతో ముస్లింలు ఉగ్రవాదులను తయారు చేయడంలో బిజీగా ఉండగా క్రైస్తవులు మతమార్పిడులు నిర్వహించుకుంటూ పోతున్నారని రాందేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం రాజస్థాన్‌లోని బర్మర్ జిల్లాలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ మీ మతం ఏం బోధిస్తుందని ఏ ముస్లిమునైనా అడిగితే రోజూ నమాజ్ చదవండి.. హిందూ మహిళలను కిడ్నాప్ చేయడంతో సహా ఇష్టమొచ్చిన పని ఏదైనా చేయండి అని చెబుతారని అన్నారు.

ఇస్లాం అంటే ఇదీ వారిచ్చే నిర్వచనమని రాందేవ్ అన్నారు. మన ముస్లిం సోదరులు పాపులని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ముస్లింలు నమ్మే స్వర్గంలో అప్సరసలు, మద్యం ఉంటుందని, వీరు చేసే పనల్లా మీసాలు తీసేసి, తెల్ల కుర్తా పైజామా, టోపీ ధరించడమేనని ఆయన అన్నారు. ఇస్లాం కానీ, ఖురాన్ కానీ ఇవేవీ చెప్పనప్పటికీ వీటినే ముస్లింలు ప్రచారం చేస్తున్నారని.. తాను ఇస్లాంను కానీ, ఖురాన్‌ను కానీ తప్పు పట్టడం లేదని కూడా రాందేవ్ వివరణ ఇచ్చారు. క్రైస్తవులను ప్రస్తావిస్తూ క్రైస్తవ మతం ఏం చెబుతోందని ఆయన ప్రశ్నించారు. చర్చికి వెళ్లి కొవ్వొత్తి వెలిగించి ఏసుక్రీస్తు ముందు నిలబడితే చాలు మీ పాపాలన్నీ కొట్టుకుపోతాయని అన్నారు.

క్రైస్తవులు ధరించే శిలువను ప్రస్తావిస్తూ వారి మెడలో శిలువను పోలిన గొలుసుతో పాటు హిందువులు ధరించే విధంగా ఇతర గొలుసులు కూడా ఉంటాయని అన్నారు. తాను ఏ మతానికి వ్యతిరేకం కానని కూడా వివరణ ఇచ్చుకున్నారు. అయితే మతమార్పిడులను సైతం ఆయన ప్రస్తావించారు. యావత్ ప్రపంచం ఇస్లాంగా మారిపోవాలని ముస్లింలు కోరుకుంటుంటే మొత్తం ప్రపంచం క్రైస్తవాన్ని నమ్మాలని క్రైస్తవులు ఆశిస్తున్నారని అన్నారు. దీంతో, రాందేవ్ బాబా ప్రసంగం వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Next Story

Most Viewed