భారత కాలేజీల్లో కేవలం 7 శాతం మాత్రమే పూర్తిస్థాయిలో క్యాంపస్ ప్లేస్‌మెంట్‌

by Dishanational1 |
భారత కాలేజీల్లో కేవలం 7 శాతం మాత్రమే పూర్తిస్థాయిలో క్యాంపస్ ప్లేస్‌మెంట్‌
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా కాలేజీల్లో కేవలం 7 శాతం మాత్రమే పూర్తిస్థాయి క్యాంపస్ ప్లేస్‌మెంట్‌ను సాధిస్తున్నాయని ఓ నివేదిక తెలిపింది. నైపుణ్యంలో అంతరాలు, కంపెనీలకు అవసరమైన స్థాయిలో ప్రతిభ లేకపోవడమే ఈ స్థాయి వ్యత్యాసానికి ప్రధాన కారణమని నివేదిక పేర్కొంది. ప్రముఖ అన్‌స్టాప్ టాలెంట్ రిపోర్ట్-2024 ప్రకారం, 91 శాతం మంది విద్యార్థులు తమ కాలేజీల్లోని పాఠ్యాంశాలు ఉద్యోగానికి తగిన స్థాయిలో బోధిస్తాయని నమ్ముతున్నారు. కానీ, 66 శాతం మంది రిక్రూటర్లు, 42 శాతం మంది యూనివర్శిటీ పార్ట్‌నర్‌లు నైపుణ్యంలో ఉన్న అంతరంతో పాటు సరైన స్థాయిలో విద్యార్థులు సన్నద్ధత చూపకపోవడం వంటి ప్రధాన కారణాలతో క్యాంపర్ రిక్రూట్‌మెంట్లలో ఉద్యోగాలు సాధించలేకపోతున్నారని నివేదిక తెలిపింది.

88 శాతం మంది హెచ్ఆర్ ప్రాక్టీషనర్లు నైపుణ్య ఆధారిత నియామకాలకు, అనుభవం, ఇంటర్‌షిప్‌లు, ప్రాజెక్టుల్లో సామర్థ్యాన్ని బేరీజు వేసుకుని ఉద్యోగులను తీసుకుంటున్నట్టు చెప్పారు. 'విద్యార్థులు, హెచ్ఆర్ నిపుణులతో చర్చించిన తర్వాత నైపుణ్యం కలిగిన విద్యార్థులు, డిమాండ్ మధ్య అంతరం తగ్గించడం అవసరమని గుర్తించినట్టు ' అన్‌స్టాప్ ఫౌండర్, సీఈఓ అంకిత్ అగర్వాల్ చెప్పారు.

ప్రస్తుతం కొనసాగుతున్న లేఆఫ్స్ కారణంగా ప్రతి ఐదుగురు విద్యార్థుల్లో ముగ్గురు అధిక వేతనాల కంటే ఉద్యోగ భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నారని నివేదిక పేర్కొంది. ఇదే సమయంలో బిజినెస్ స్కూల్ విద్యార్థుల్లో గణనీయమైన శాతం మంది పేరున్న సంస్థలు లేదా వారసత్వ సంస్థల్లో చేరేందుకు ఇష్టపడుతున్నారు. గతంలో మాదిరి స్టార్టప్‌లలో పనిచేసేందుకు పెద్దగా ఇష్టపడటంలేదు.

బిజినెస్ స్కూల్ విద్యార్థులు ఎక్కువగా మార్కెటింగ్ ఉద్యోగాలను ఇష్టపడుతుండగా, ఆర్ట్స్ అండ్ సైన్స్ విద్యార్థులు ఫైనాన్స్, అనలటిక్స్ ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆర్ట్స్, సైన్స్, కామర్స్‌లో పురుషులకు సాధారణ వేతనం ఏడాదికి రూ. 6-10 లక్షలు ఉండగా, మహిళలకు ఏటా రూ. 2-5 లక్షలుగా ఉంది. బిజినెస్ స్కూల్లో 55 శాతం మంది పురుషులు ఏడాదికి రూ. 16 లక్షల అధిక వేతనం పొందుతుండగా, 45 శాతం మంది మహిళలు మాత్రమే ఈ మొత్తం మొత్తం ఆఫర్‌ను అందుకుంటున్నారని నివేదిక పేర్కొంది.


Next Story