జార్ఖండ్ ప్రమాదంలో టీ అమ్మే వ్యక్తి రియల్ హీరో..!

by Shamantha N |   ( Updated:2024-06-15 17:54:49.0  )
జార్ఖండ్ ప్రమాదంలో టీ అమ్మే వ్యక్తి రియల్ హీరో..!
X

దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్‌లోని లాతేహర్ పట్టణంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న రైలు ప్రమాద ఘటనలో ఓ టీ అమ్మే వ్యక్తి రియల్ హీరోగా మారాడు. రాత్రి 8గంటల సమయంలో రాంచీ-ససారం ఎక్స్ ప్రెస్‌లో మంటలు చెలరేగాయంటూ పుకార్లు వ్యాపించాయి. అవి నిజమేనని నమ్మి కొందరు ప్రయాణికులు.. ఆ రైలు నుంచి దూకి భయంతో పరుగులు తీశారు. ఈక్రమంలో అటువైపుగా వచ్చిన గూడ్స్ రైలు ఢీకొని ముగ్గురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈక్రమంలో గూడ్స్ రైలు వస్తోందని గుర్తించిన ఓ టీ అమ్మే వ్యక్తి రైల్వే ట్రాక్ పైనుంచి కొందర్ని పక్కకు లాగాడు. దీంతో వారంతా గండం నుంచి గట్టెక్కారు. ఈవివరాలను ప్రత్యక్ష సాక్షులు శనివారం మీడియాకు వివరించారు. గూడ్స్ వచ్చే ట్రాక్‌పైకి ప్రయాణికులు వెళ్లకుండా ఆ టీ అమ్మే వ్యక్తి అడ్డుకున్నాడని, లేదంటే మృతుల సంఖ్య పెరిగి ఉండేదన్నారు. కాగా, ఈ రైలు ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం జరిగిన స్థలం మావోయిస్టుల ప్రభావిత ప్రాంతంగా గుర్తించారు. దీనివెనక మావోయిస్టుల పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కుమండిహ్ రైల్వే స్టేషన్‌పై అనేక సార్లు మావోయిస్టులు దాడికి పాల్పడ్డారని పోలీసు వర్గాలు తెలిపాయి.

Advertisement

Next Story

Most Viewed