నార్త్ ఇండియాలో హీట్ వేవ్..ఆ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ

by vinod kumar |
నార్త్ ఇండియాలో హీట్ వేవ్..ఆ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తర, మధ్య భారతదేశంలోని అనేక ప్రాంతాలు జూన్ 19 వరకు ఎటువంటి ఉపశమనాన్ని పొందే అవకాశం లేదని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లలో గరిష్ట ఉష్ణోగ్రతలు 44-46 డిగ్రీల సెల్సియస్‌లో నమోదవుతున్నందున రాబోయే ఐదు రోజుల పాటు ఆరెంజ్, రెడ్ అలర్ట్‌లు జారీ చేసింది. ఈ ఉష్ణోగ్రత పరిధి మధ్యప్రదేశ్, బిహార్, హర్యానా, చండీగఢ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా కనిపించనున్నట్టు వెల్లడించింది. ఉత్తరప్రదేశ్‌లోని చాలా ప్రాంతాలు 15 ,19 తేదీల మధ్య తీవ్ర వేడిగాలులు ఉంటాయని పేర్కొంది. అలాగే పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలు15వ తేదీన మాత్రమే హీట్ వేవ్ పరిస్థితులను కలిగి ఉండనున్నాయి.

మరోవైపు.. మేఘాలయలో జూన్ 15 నుంచి 19 వరకు, అసోంలో జూన్ 17, 19 మధ్య భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని తెలిపింది. శనివారం నుంచి ఐదు రోజుల పాటు దక్షిణ, పశ్చిమ, తూర్పు, ఈశాన్య భారతదేశంలోనూ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇదిలా ఉండగా రాబోయే నాలుగైదు రోజుల్లో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలు, బిహార్‌లోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed