మ‌హారాష్ట్ర‌లో మ‌రో శివ‌సేనా భ‌వ‌న్‌.. క్లారిటీ ఇచ్చిన మినిస్ట‌ర్‌

by Disha Web Desk 20 |
మ‌హారాష్ట్ర‌లో మ‌రో శివ‌సేనా భ‌వ‌న్‌.. క్లారిటీ ఇచ్చిన మినిస్ట‌ర్‌
X

దిశ‌, వెబ్‌డెస్క్ః మ‌హారాష్ట్ర‌లో అధికారంలో ఉన్న 'శివసేన' పార్టీ మాదంటే మాదంటూ అటు మాజీ ముఖ్య‌మంత్రి థాక్రే వ‌ర్గం, ఇటు రెబ‌ల్, తాజా ముఖ్య‌మంత్రి షిండే వ‌ర్గం సుప్రీంకోర్టులో పోరాటం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఏక్‌నాథ్‌ షిండే శిబిరం ప్ర‌స్తుత‌మున్న శివ‌సేనా భ‌వ‌న్‌కు సమాంతరంగా కొత్త శివసేన భవన్ నిర్మించ‌డం కోసం స్థ‌లం వెతుకుతోందని, విడిపోయిన వర్గానికి అది ప్ర‌ధాన‌ పార్టీ కార్యాలయం కానుంద‌ని పలువురు పేర్కొంటున్నారు. ముంబాయ్‌లో కొత్త‌ శివసేన భవన్‌తో పాటు రాష్ట్ర‌వ్యాప్తంగా ప్రతిచోటా కొత్త శాఖలు, స్థానిక పార్టీ కార్యాలయాలను కూడా తెరవాలని యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, కొత్త భవన్ కోసం ఇంకా లొకేషన్ ఫిక్స్ కాలేదని, ముంబైలోని దాదర్‌లో ప్రస్తుతం ఉన్న శివసేన భవన్‌కు దగ్గర్లో మ‌రో స్థలం కోసం వెతుకుతున్నట్లు వర్గాలు తెలిపాయి.

ఈ క్ర‌మంలో ఈ సమాంతర సేన భవన్ ఊహాగానాలను కొట్టివేస్తూ, కొత్తగా చేరిన మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సమంత్ ఇది కేవ‌లం అపోహ మాత్ర‌మే అని అన్నారు. దాదర్‌లో సమాంతరంగా శివసేన భవన్‌ నిర్మాణం జరుగుతోందన్న అపోహ ప్ర‌జ‌ల్లో ఉందని, అయితే సీఎం షిండే సామాన్య ప్రజలను కలిసేందుకు వీలుగా కేంద్ర కార్యాలయం నిర్మించ‌డం కోసం మాత్ర‌మే ప్రయత్నిస్తున్నామని, శివసేన భవన్‌ను గౌరవిస్తున్నామని, అది అలాగే ఉంటుందని ఆయన స్ప‌ష్టం చేశారు.



Next Story