కేజ్రీవాల్ ను చంపేందుకు కుట్ర.. ఆప్ సంచలన ఆరోపణలు

by Dishanational6 |
కేజ్రీవాల్ ను చంపేందుకు కుట్ర.. ఆప్ సంచలన ఆరోపణలు
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్రప్రభుత్వంపై, మోడీపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. కేజ్రీవాల్ ను చంపేందుకు కుట్ర పన్నుతున్నారని ఆప్ నేతలు ఆరోపించారు. కాగా, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆప్ అధినేత సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో ఉన్నాడు. అయితే జైలులో కేజ్రీవాల్ మామిడిపండ్లు, స్వీట్లు, ఆలూ పూరీలు తింటున్నాడని ఈడీ కోర్టుకు తెలిపింది. షుగర్ వ్యాధితో బాధపడుతున్న కేజ్రీవాల్ తన షుగర్ లెవల్స్ పెంచుకుని, అనారోగ్య సమస్యలతో బెయిల్ పొందాలని చూస్తున్నారంటూ ఆరోపించింది ఈడీ. అయితే, ఈ ఆరోపణలను ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఢిల్లీ సీఎం హత్యకు కుట్ర పన్నుతున్నారని.. కేజ్రీవాల్ ను చంపేందుకు మోడీ యత్నిస్తున్నారని ఢిల్లీ మంత్రి అతిషీ ఆరోపించారు.

ఢిల్లీ మంత్రి అతిషీ మీడియాతో మాట్లాడుతూ.. కేజ్రీవాల్‌ని చంపడానికి బీజేపీ, మోడీ కుట్ర పన్నారని ఆరోపించారు. జైలులో ఆయనకు ఇంటి భోజనాన్ని నిలిపివేయాలని ఈడీ, బీజేపీ భావిస్తున్నాయని మండిపడింది. కోర్టులో అతను స్వీట్లు, టీ తాగుతున్నాడని ఈడీ ప్రస్తావించిందని చెప్పుకొచ్చింది. అయితే, ఇదంతా అబద్ధమని అతిషీ చెప్పారు. కేజ్రీవాల్ అరటిపండ్లు తినడం అనేది ఈడీ అబద్ధమని.. షుగర్ పేషెంట్స్ ఎమర్జెన్సీ కోసం చాక్లెట్లు, పండ్లు తమతో ఉంచుకోవాలని కోరుతారని అన్నారు. ఈడీ సమర్పించిన డైట్ చార్ట్‌లో కేజ్రీవాల్‌కి ఒక రోజు మాత్రమే పూరీ ఉందని, అది కూడా నవరాత్రి మొదటి రోజని, అతనికి మీరు నవరాత్రి ప్రసాదాన్ని అనుమతించలేదా..? అని ప్రశ్నించారు.

కేజ్రీవాల్ మధుమేహంతో బాధపడుతున్నారని అందరికీ తెలుసని అన్నారు. ఆయన గత 30 ఏళ్లుగా డయబెటిస్ తో ఇబ్బందిపడుతున్నారని.. రోజూ 54 యూనిట్ల ఇన్సులిన్ తీసుకుంటారని తెలిపారు. ఏ డాక్టర్‌ని అడగండి.. ఇంత తీవ్రమైన మధుమేహం ఉన్న వ్యక్తి మాత్రమే అంత ఇన్సులిన్ తీసుకుంటారని అన్నారు. అయితే, బీజేపీ తన అనుబంధ సంస్థ ఈడీ ద్వారా కేజ్రీవాల్ ఆరోగ్యాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.

చక్కెర స్థాయిల్లో తేడాలు ఉన్నందున రెగ్యులర్ డాక్టర్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంప్రదించేందుకు అనుమతి కోరుతూ కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరుగుతుండగా.. ఈడీ కేజ్రీవాల్ పై తీవ్ర ఆరోపణలు చేసింది. దీనిపై స్పందించిన ఢిల్లీ మంత్రి ఆతిషీ ఈ వ్యాఖ్యలు చేశారు.

Next Story

Most Viewed