యూపీలో భారీ వర్షాలు.. 10 మంది మృతి

by Disha Web Desk 21 |
యూపీలో భారీ వర్షాలు.. 10 మంది మృతి
X

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాల బారిన పడి కనీసం 10 మంది చనిపోగా మరో 11 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఎటావాహ్ ప్రాంతంలో ఏడుగురు చనిపోయారని, పిడుగుపాటుకు, ఇల్లుకూలి 11 మందికి గాయాలయ్యాయని చెప్పారు. భారీ వర్షాల ధాటికి ఫిరోజాబాద్ వంటి పట్టణాల్లో జనజీవితం అస్తవ్యస్థమైంది. ఆలీగర్‌లో పాఠశాలలు మూసివేశారు. వాతావరణ శాఖ వివరాల ప్రకారం, బుధవారం ఉదయం నుంచి పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో కుండపోత వర్షం కురుస్తోంది. గత 24 గంటల్లో అంటే గురువారం ఉదయం 8.30 గంటలకు 140 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసిందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆగ్రాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నట్లు తెలిపింది. కాగా ఎటావాహ్‌లో బుధవారం మూడు చోట్ల ఇళ్లు కూలిన దుర్ఘటనల్లో 7గురు మరణించారు.

ఎటావాహ్ లోని చంద్ర పుర గ్రామంలో వర్షానికి బాగా నానిపోయిన ఇల్లు కూలి 5 నుంచి 10 సంవత్సరాల వయసు కలిగిన నలుగురు పిల్లలు మరణించారని జిల్లా మెజిస్ట్రేట్ అవనీష్ కుమార్ రాయ్ తెలిపారు. ఈ ఘటనలో అయిదేళ్ల పాప, ఆమె అమ్మమ్మ చాందనీ దేవి (70) గాయపడ్డారు. కృపాల్ పూర్‌లో జరిగిన మరో ఘటనలో రామ్ సనేహి (65), రేష్మా దేవి (62) అనే వృద్ధ దంపతులు పెట్రోల్ పంపు సరిహద్దు గోడ కూలి చనిపోయారని ఎస్పీ కపిల్ దేవ్ సింగ్ తెలిపారు. అండవ కే బంగ్లాన్ గ్రామంలో మరో ఇల్లు కూలిన ఘటనలో జబీర్ సింగ్ (35) మట్టిలో సమాధి అయిపోయారని చక్రార్ నగర్ పోలీసు స్టేషన్ ఎస్సై దీపక్ కుమార్ చెప్పారు. ఆలీగర్‌లో గత మూడురోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నందున స్కూళ్లు మూసేశారు. నగరంలో పలు ప్రాంతాలు నీటమునిగాయని అధికారులు చెప్పారు.



Next Story