సినీ నటి సాయి పల్లవికి హైకోర్టులో చుక్కెదురు

by Disha Web Desk |
సినీ నటి సాయి పల్లవికి హైకోర్టులో చుక్కెదురు
X

దిశ, తెలంగాణ బ్యూరో : కశ్మీర్ ఫైల్స్​ సినిమాతో పాటు గోరక్షకులపై సినీ నటి సాయి పల్లవి చేసిన వ్యాఖ్యల దుమారం మరో కీలక మలుపు తిరిగింది. సాయి పల్లవి వివాదస్పద వ్యాఖ్యలు చేశారంటూ భజరంగ్​ దళ్​ నాయకులు సుల్తాన్​ బజార్​ పోలీస్​ స్టేషన్​ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై న్యాయ సలహా తీసుకుని, కేసు నమోదు చేసిన పోలీసులు.. గత నెల 21న సాయి పల్లవికి నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను రద్దు చేయాలని సినీ నటి సాయి పల్లవి హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై గురువారం విచారించిన హైకోర్టు.. సాయి పల్లవి వేసిన పిటిషన్​ ను కొట్టి వేస్తూ అభ్యర్థనను తోసి పుచ్చింది. 'విరాటపర్వం' సినిమా ప్రచారంలో భాగంగా సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూలో 'కశ్మీర్‌ ఫైల్స్‌' సినిమా గురించి మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లెఫ్ట్​ వింగ్​, రైట్​ వింగ్​ గురించి విన్నానని, తాను మాత్రం న్యూట్రల్​ గా ఉంటానని చెప్పుకొచ్చారు.

ఈ నేపథ్యంలోనే కశ్మీర్​ ఫైల్స్​ సినిమా గురించి మాట్లాడారు. 90లో కశ్మీర్​ పండిట్లను ఎలా చంపారో చిత్రంలో చూపించారని, కొవిడ్​ సమయంలో ఓ ప్రాంతంలో గోవును వాహనంలో తరలిస్తుండగా దాని డ్రైవర్​ ఓ ముస్లిం అని, కొంతమంది డ్రైవర్​ ను కొట్టి జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారని, అప్పుడు జరిగిన దానికి, ఇప్పుడు జరిగినదానికి తేడా ఏముందంటూ సాయి పల్లవి వ్యాఖ్యానించారు. మంచిగా ఉండాలి.. ఎదుటివారిని ఇబ్బంది పెట్టకూడదు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై భజరంగ్​ ధళ్​ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇచ్చిన నోటీసులపై సాయిపల్లవి హైకోర్టును ఆశ్రయించగా.. ఆ పిటిషన్​ ను కోర్టు కొట్టి వేసింది.



Next Story