ప్రతి ఒక్కరూ రెండో డోస్ కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలి: మంత్రి హరీశ్ రావు

by  |
ప్రతి ఒక్కరూ రెండో డోస్ కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలి: మంత్రి హరీశ్ రావు
X

దిశ, ములుగు: మొదటి డోస్ వేసుకున్న వారంతా తప్పనిసరిగా రెండో డోస్ వేయించుకోవాలని క్షీర సాగర్ గ్రామ ప్రజలకు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. గ్రామ ప్రజలకు ఉచిత మినరల్‌ వాటర్‌ అందించాలనే లక్ష్యంతో ఎంపీటీసీ కొన్యాల మమత బాల్ రెడ్డి వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయడం అభినందనీయమని మంత్రి హరీశ్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్ గ్రామంలో గురువారం కొన్యాల బాల్ రెడ్డి తండ్రి నారాయణరెడ్డి జ్ఞాపకార్థం, కేబీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మినరల్ అండ్ కూల్ వాటర్ ప్లాంట్ ను మంత్రి హరీశ్ రావు చేతుల మీదుగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా క్షీరసాగర్ గ్రామస్తులంతా కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ వేసుకున్నారా అంటూ.. ఆరా తీశారు. తప్పనిసరి వేసుకునేలా స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలను చైతన్యం చేయాలని కోరారు. గ్రామ ప్రజల కోసం ఏంపీటీసీ బాల్ రెడ్డి సొంత నిధులతో చేపడుతున్న అభివృద్ధి అభినందనీయమని, గ్రామంపై బాల్ రెడ్డికి ఉన్న మమకారం, ప్రేమ వెలకట్టలేనిదని మంత్రి కొనియాడారు. కార్యక్రమంలో మాజీ ఎఫ్ డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ కాయితి యాదమ్మ, జడ్పీటీసీ జయమ్మ అర్జున్ గౌడ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ నరేష్ గౌడ్, హంస హోమియోపతి కళాశాల డైరెక్టర్ అఖిల, సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు గణేష్ గుప్తా, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed