సాగర్‌లో టెన్షన్ టెన్షన్.. టీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ

by  |
సాగర్‌లో టెన్షన్ టెన్షన్.. టీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: నాగార్జునసాగర్ ఉపఎన్నిక రణరంగంగా మారింది. తూటాల్లాంటి నేతల మాటలతో నియోజకవర్గం నివురు గప్పిన నిప్పులా మారింది. పార్టీల నేతల కవ్వింపు ప్రసంగాలతో క్షేత్రస్థాయిలోని కార్యకర్తలు ఘర్షణలకు దిగుతున్నారు. సాగర్ ఉపఎన్నిక ప్రచార పర్వం మాటల స్థాయి నుంచి బాహబాహీకి దిగే వరకు వచ్చింది. మంగళవారం ఏకంగా అనుముల మండలంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ప్రచారాన్ని అడ్డుకోవడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ మొదలైనట్టు సమాచారం. ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడంతో పలువురు గాయపడినట్టు తెలుస్తోంది. ఘటనాస్థలంలోనే ఉన్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు స్వల్పంగా లాఠీ ఛార్జీ చేయాల్సి వచ్చింది. అయితే లాఠీ ఛార్జి సందర్భంగా ఓ పోలీసు అధికారి.. ఓ యువకుడిని బూటు కాలుతో తన్నడం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

ధర్నాకు దిగిన జయవీర్..

అనుముల మండలంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలకు గాయాలయ్యాయి. దీంతో విషయం తెలుసుకున్న కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జానారెడ్డి తనయుడు జయవీర్ రెడ్డి ధర్నాకు దిగారు. దీంతో పరిస్థితి ఇంకాస్త ఉద్రిక్తతంగా మారింది. హాలియాలో బుధవారం సీఎం కేసీఆర్ సభ ఉన్న నేపథ్యంలో నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితులు నెలకొనడం.. సభ సజావుగా సాగేనా అన్న ధోరణిలో ఆందోళన వ్యక్తం అవుతోంది.

మధ్యాహ్నం జరిగింది ఇదీ..

సాగర్ నియోజకవర్గంలోని అనుముల మండలం కొత్తపల్లిలో ప్రచారం నిర్వహిస్తోన్న మంత్రి జగదీష్ రెడ్డి ప్రచారాన్ని స్థానిక నిరుద్యోగ యువకుడు ఒకరు అడ్డుకున్నారు. నిరుద్యోగ భృతి.. ఉద్యోగాలు ఎక్కడ అంటూ మంత్రి జగదీష్ రెడ్డిని నిలదీశాడు. అయితే ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తమ గ్రామంలోకి ప్రచారానికి ఎలా వస్తారంటూ ప్రశ్నించారు. దీంతో మంత్రి జగదీష్ రెడ్డి సదరు యువకుడిపై సీరియస్ అయ్యారు. ‘నిన్ను నీ నాయకుడిని తొక్కి పడేస్తా.. నీలాంటి కుక్కలను చాలామందిని చూశానని’ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిగ్గా నెల రోజుల క్రితం హాలియా సభలో సీఎం కేసీఆర్ సైతం గిరిజన మహిళలను కుక్కలంటూ ఫైర్ అయ్యిన సంగతి తెలిసిందే. ఇదిలావుంటే.. ఓటర్లను కుక్కలతో పోల్చడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అసలేం జరుగుతోంది…?

నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. అయితే ప్రచారపర్వంలో రోజురోజూకీ ఏం జరుగుతుందనే విషయం నియోజకవర్గ ప్రజలకు అంతుచిక్కడం లేదు. ఎక్కడి నుంచో వచ్చిన ఎమ్మెల్యేలు, నేతలు.. స్థానికుల మధ్య చిచ్చుపెట్టేలా ప్రసంగాలు చేస్తున్నారంటూ కొంతమంది గగ్గోలు పెడుతున్నారు. ప్రచారానికి వచ్చిన నేతలంతా రెండు మూడు రోజుల్లో ఇక్కడి నుంచి వెళ్లిపోతారు. నాయకుల మాటలకు టెమిట్ అయ్యి ఘర్షణలకు దిగే యువకుల పరిస్థితి ఏంటన్నది వారు చెబుతున్న మాట. ఇలాంటి ప్రచారానికి ఏ పార్టీ అయిన స్వస్తి చెప్పాలంటూ నియోజకవర్గ ఓటర్లు కోరుతున్నారు.


Next Story

Most Viewed