పడికట్టు తూకంలో మాయజాలం

by  |
పడికట్టు తూకంలో మాయజాలం
X

దిశ, భద్రాచలం: మన్యంలో రైతులను వ్యాపారులు యదేచ్ఛగా దోచుకొనే ఖరీఫ్ (వానాకాలం) ధాన్యం, పత్తి పంటల సీజన్ వచ్చేసింది. చర్ల, దుమ్మ గూడెం మండలాల్లో వరికోతలు మొదలైనాయి. కొత్త ధాన్యం మార్కెట్‌లోకి వస్తోంది. అందినకాడికి రైతులను దోచుకుంటున్నారు. రైతుల వద్ద ధాన్యా న్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి అదే ధాన్యం ప్రభుత్వ పరంగా ఏర్పాటయ్యే కొనుగోలు కేంద్రాలలో అమ్ముకోవడమో, లేదా పట్టణ ప్రాంతాల్లోని మిల్లర్లకు తరలించడానికి వ్యాపారులు సిద్ధం అయ్యారు. ఈ క్రమంలో రైతుల చెంతకు దళారీ ధాన్యం వ్యాపా రులు ఉరుకులు, పరుగులు తీస్తున్నారు. ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యం లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా ఇంకా కొనుగోళ్లు ఆరంభించలేదు. అయితే ప్రైవేటు వ్యాపారుల ధాన్యం లోడ్లు మాత్రం మిల్లులకు తరలిపోతున్నారు.

తూకంతో మోసం..

ప్రతీ సంవత్సరం సీల్ వేసిన కాంటా రాళ్లతో తూ కం వేయాల్సిఉండగా, అడిగేవారెవరనే ధీమాతో బండరాళ్లను, వడ్ల బస్తాలను కాంటాలో పెట్టి పడికట్టు తూకంతో ప్రైవేటు వ్యాపారులు రైతులను యదేచ్ఛగా మోసం చేస్తున్నారు. చిన్న సైజు సంచుల్లో ధాన్యం పట్టి సంచి బరువు కింద కిలో తరుగు తీస్తున్నట్లు సమాచారం.‌ తూకంలో కూడా మొగ్గు పడుతున్నట్లు తెలుస్తోంది. ఇలా తూకంలో కళ్ల ముందే మోసం చేయడమే గాకుండా ధర విషయంలోనూ ప్రైవేటు వ్యాపారులు దగా చేస్తున్నారు. ప్రభుత్వం సాధారణ రకం ధాన్యం క్వింటాల్‌కి రూ. 1868 ధర నిర్ణయించింది. ఆ ప్రకారం 75 కిలోలకి రూ.1400 చెల్లించాల్సి ఉండగా చర్ల మండలం ఆర్.కొత్తగూడెంలో ఓ ధాన్యం వ్యాపారి రైతు ల దగ్గర 75 కిలోల బస్తా రూ.900 లకే కొనుగోలు చేస్తుండగా ఇటీవల ఓ సివిల్ సప్లై అధికారి పట్టు కొని సదరు వ్యాపారిని మందలించినట్లు సమా చారం. రైతులు ఆరబెట్టే అవసరం లేకుండా పచ్చి ధాన్యం కొంటున్నామనే వంకతో ధాన్యం వ్యాపారులు అందరు ఏకమై సాధారణ రకం (ముతక) ధాన్యం ప్రభుత్వ మద్దతు ధరకంటే తక్కువకు రైతుల దగ్గర కొనుగోలు చేస్తున్నారు. కొందరు వ్యాపారు లు వరికోత యంత్రాలు తీసుకొచ్చి వరిచేలు దగ్గర ఉండి కోత కోయించి ధాన్యం పట్టుకొని పోతున్నా రు. రైతుల పెట్టుబడి, కోత ఖర్చులు, వడ్డీలు పోనూ వస్తే రైతులకు తిరిగి ఇవ్వడం లేదంటే వచ్చే పంటకి పెట్టుబడిగా కొంత ముట్టజెప్పి రైతు కుటుంబాలపై ప్రేమ నటిస్తుంటారు. ఇది ప్రతీ ఏడాది జరిగేదే.

దోచుకుంటున్న ఫెర్టిలైజర్స్ వ్యాపారులు..

ఏజెన్సీలో ఫెర్టిలైజర్ వ్యాపారం మూడు లక్షలు పెట్టుబడి, ఆరు లక్షలు రాబడిగా అన్నట్లుగా ఉంది. అందుకే మన్యంలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల షాపులు గల్లీకి ఐదారు పుట్టుకొస్తున్నాయి. రైతులకు మొదటి నుంచి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, అవసరానికి కొంత నగదు అప్పుగా ఇచ్చే ఫెర్టిలైజర్స్ వ్యాపారులే సీజన్ వచ్చేసరికి ధాన్యం, పత్తి తదితర పంటలు కొనుగోలు చేసే వ్యా పారులుగా మారి ధర, తూకం‌ విషయాల్లో రైతులను దగా చేస్తున్నారు. అయినా పెట్టుబడిదారులనే భావనతో రైతులు దళారీ వ్యాపారుల మోసాలను ప్రశ్నించలేని పరిస్థితి. అదే అందివచ్చే అవకాశంగా ఏజెన్సీ ఫెర్టిలైజర్స్ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. మరో ఆసక్తికర అంశం ఏమంటే పెట్టుబడి రాబట్టుకొనే కారణం చూపించి రైతుల దగ్గర తక్కువ ధరకు ధాన్యం కొన్న వ్యాపారులు అదే ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో అమ్మి లాభాలు ఆ ర్జిస్తారు. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం అమ్మితే ప్రభుత్వం ధాన్యం బాపతు నగదుని రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. అయితే రైతులు తమ అకౌంట్‌లో పడే డబ్బులు డ్రా చేయకుండా రైతులను నమ్మలేని కొందరు దళారీ వ్యాపారులు రైతుల ఏటీఎం కార్డులు తీసుకొని దగ్గర ఉంచుకొంటారు. మరికొందరు రైతులతో చెక్‌బుక్ అకౌంట్లు తెరిపించి రైతులతో చెక్కులపై ముందుగానే సంతకాలు చేయించి దగ్గర పెట్టుకొంటారు.

ప్రభుత్వాన్ని మోసగిస్తున్న దళారీలు..

విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు రైతులకు అప్పుగా ఇచ్చే ఫెర్టిలైజర్స్ వడ్డీలకు వడ్డీలు వేసి రైతులను పీల్చి పిప్పిచేయడమే కాకుండా రైతుల పేర్ల తో వ్యవసాయ ఉత్పత్తులు మిల్లర్లకు, మార్కెట్‌లకు తరలించి ప్రభుత్వానికి (మార్కెట్ కమిటీలకు) ప న్ను ఎగవేస్తున్నారు. రైతుల పేర్లతో ధాన్యం, ప్రత్తి, మిర్చి వంటి పంటలు మార్కెట్‌కి తరలించే వ్యాపారులకు క్షణాల్లో వేబిల్స్ (రవాణ పత్రాలు) లభిస్తా యి. రెవెన్యూ, అగ్రికల్చర్, మార్కెట్ కమిటీ, పీఏసీఎస్, జీసీసీ (ఐకేపీ) శాఖల అధికారుల అండదండలతోనే దళారీ ధాన్యం వ్యాపారులు ఏజెన్సీలో య దేచ్ఛగా పంటలు మార్కెట్‌లకు తరలించుకపోతారు. అధికారుల అండదండలతోనే ప్రతీ సీజన్‌లో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందనేది యథార్థం.

ఈసారైనా దళారీలకు చెక్ పెట్టేనా?

ఏజెన్సీలో రైతులను యదేచ్ఛగా దోచుకొనే వ్యా పారులకు ఈసారైనా అధికారులు చెక్ పెడతా రా లేక గతంలో మాదిరిగానే చూసిచూడనట్లు వదిలేస్తారా అనేది మన్యంలో చర్చనీయాంశమైంది. రైతులు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకొంటామని అధికారులు చెబుతుంటారు. అయితే కళ్ల ముందు జరిగే మోసాన్ని ప్రశ్నించినా లేదా అధికారులకు ఫిర్యాదు చేసినా ఆ రైతుకి ఇక పెట్టుబడి కష్టమే. ఆ వ్యాపారే కాదు. ఇక ఏ వ్యాపారి దగ్గర అప్పు పుట్టదు. అందుకే మోసాన్ని రైతులు నిలదీయలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే నిఘా పెట్టి రైతులను దోచుకొనే అక్రమార్కుల ఆట కట్టించాలి.‌ లేదంటే అడిగేవారు లేరనే ధీమాతో దళారీల ఆగడాలకు హద్దుండదు.

Next Story