దశాబ్దాలుగా మూతపడి తెరుచుకున్న ఆలయం ఏదో తెలుసా..

by Disha Web Desk 7 |
దశాబ్దాలుగా మూతపడి తెరుచుకున్న ఆలయం ఏదో తెలుసా..
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నో పుణ్యస్థలాలను, మరెన్నో చారిత్రక కట్టడాలను తన పొత్తిల్లలో దాచి కాపాడుతుంది మన భారతావణి. పూర్వం దేశాన్ని రాజులు పాలించే కాలంలో రాజవంశీకులు ఎన్నో ఆలయాలను నిర్మించారు. ఆలయాల నిర్వహణ కోసం మడులను, మాన్యాలను ఏర్పాటు చేశారు. రాజులు రాజ్యాలను గెలిచి తెచ్చిన ధన, కనక సంపదలను తమ రాజభవనాల్లో కాకుండా ఆలయాల్లోనే దాచి ఉంచేవారు. ఆ కారణంగానే పరమతస్థులు ఆలయాలపై దండయాత్ర చేసి ఆలయాలను కొల్లగొట్టేవారు. అలా నామరూపాలు లేకుండా చేసిన ఆలయాలను కాలగమనంలో కలిసిపోకుండా, వాటి గుర్తలను చెరపకుండా పునర్నిర్మిస్తున్నారు.

ఇలా ఎంతో ప్రసిద్ది గాంచిన ఆలయాలలో రాయ వేలూరు కోటలో ఉన్న జలకంఠేశ్వరాలయం ఎంతో పురాతనమైనది. ఆ ఆలయం తమిళనాడు రాష్ట్రం, వెల్లూరు జిల్లాలో ఉంది. ఈ జలకంఠేశ్వరాలయంలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ ప్రదేశం ఏదంటే అది ఈ ఆలయ ఆవరణలో ఉన్న కళ్యాణ మండపం. కళ్యాణ మండపం చిన్నదైనా, శిల్పకళా కౌశలం రీత్యా చాల అద్భుతంగా ఉంటుంది. ఫలానా ఆలయాలు ఎవరు కట్టించారనగానే శ్రీ కృష్ణ దేవరాయలు గుర్తు వచ్చే విధంగా ఆలయ నిర్మాణం ఉంటుంది. అంతేకాదు ఈ ఆలయాన్ని సదాశివరాయల కాలంలో విజయనగరాధీశుడు కట్టించినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. కాలం గడుస్తున్నా కొద్ది ఈ ఆలయం బ్రిటిష్ వారి ఆధీనంలోకి వచ్చింది. రాయవేలూరు కోటలోనే ప్రధాన ఆలయం ఉన్నందుకు కోటతో పాటు ఈ ఆలయాన్ని కూడా బ్రటిష్ వారు స్వాధీనం చేసుకోగలిగారు.

బ్రిటీష్ వారు ఆలయాన్ని ఆక్రమించిన తర్వాత వారు కళ్యాణ మండపంలోని శిల్పకళా రీతులకు ముగ్ధులయ్యారు. శిల్పాలను ఏ కీలుకు ఆ కీలు జాగ్రత్తగా విడదీసి సముద్రాలు దాటించి లండనులో పునఃప్రతిష్ఠించాలని భావించారు. అందుకు కావలసిన ఏర్పాట్లన్నీ ముందుగానే చేసుకున్నారు. సముద్రాలు దాటించడానికి ఒక స్టీమరు లండను నుండి తెప్పించబోయారు. కాని భారతీయుల అదృష్టమో, బ్రిటీష్ వారి దురదృష్టమో ఆ స్టీమరు మార్గ మధ్యలో మునిగి పోయింది. దాంతో కళ్యాణ మండపాన్ని లండన్‌కు తరలించే కార్యక్రమం మూలన పడింది. ఆ విధంగా శిల్పకళా కౌశలాన్ని మనం ఈ రోజు చూడగలుగుతున్నాము. ఈ కళ్యాణ మండపం మూడు భాగాలుగా ఆలయ ప్రధాన గోపురానికి ప్రక్కనే ఒక మూలన ఉంది.

నలబై ఆరు శిల్ప కళా శోభితమైన స్తంభాలు ఉన్నాయి. ముందు భాగంలో చుట్టు ప్రహరి గోడ లేకుండా మధ్యన పైకప్పుకు ఉన్న శిల్పకళను చూడ వచ్చును. మొదటి దాని కన్నా రెండో భాగం మూడడుగుల ఎత్తు ఉన్నప్పటికీ లోనికి వెళ్లడానికి మెట్లు నిర్మించ లేదు. మూడోది రెండో భాగం కన్నా ఇంకొంచెం ఎత్తుగా ఉంది. ఈ రెండు భాగాలకు మాత్రం చుట్టు గోడ ఉంది. మండపం మధ్యలో చిన్న వేదికగా కూర్మం (తాబేలు) శిల్పం చెక్కి ఉంది. స్తంభాలపై అష్ట దిక్పాలకుల చిత్రాలు, దేవతా మూర్తుల చిత్రాలు, సంగీత కారుల, నాట్య గత్తెల శిల్పాలు మండపంలో కనువిందు చేస్తాయి. ప్రతి స్తంభం మీద ఉన్న శిల్పకళలు అనేక పురాణ గాథలను తెలుపుతాయి. మండపంలో ఉన్న అన్ని శిల్పాల్లో ఓ శిల్పం ప్రత్యేకంగా ఉంటుంది. అది ఒక ఏనుగు, ఒక ఎద్దు, ఎదురెదురుగా నిలబడి ఉన్నట్టుగా కనిపిస్తుంది. కాని ఆ రెండింటికి తల ఒక్కటే. ఏనుగు శరీరాన్ని మూసి చూస్తే ఎద్దు ఆకారం కనబడుతుంది. ఎద్దు శరీరాన్ని మూసి చూస్తే ఏనుగు కనిపిస్తుంది. అదే ఆ శిల్పంలో దాగి ఉన్న రహస్యం. ఇలాంటి చిత్రం హజరా రామాలయంలోను, హంపి లోని అచ్యుత రామాలయంలోను, దసరా దిబ్బ ప్రక్కన మైదానంలోను ఉన్నాయి.

ఆలయ చరిత్ర..

రాయ వెల్లూరు కోటలో ఉన్నజల కంఠేశ్వరాలయం విజయనగర సామ్రాజ్యాధినేత సదాశివరాయల కాలంలో పదహారవ శతాబ్దంలో కట్టబడింది. ఈ కోట, అందులో భాగమైన ఈ ఆలయం విజయనగర పతనం చెందిన తరువాత ముస్లింల పాలకుడైన ఆర్కాడు నవాబుల పాలనలోనికి వెళ్లింది. ఈ ఆలయంలోని దేవతా మూర్తులను, శివ లింగాలను ఆ సమయంలో ధ్వంసం చేయబడింది. విగ్రహాలను అగడ్తలో పడేసారు. అడప దడపా అగడ్తలో దొరికిన శిల్ప ఖండాలే ఆలయంలో ఉన్న విగ్రహాలను అగడ్తలో పడవేసి ఉంటారనడానికి నిదర్శనంగా నిలిచాయి. అగడ్తలో త్రవ్వకాలు జరిపితే ధ్వంసం అయిన విగ్రహాలు బయట పడవచ్చును.

ముస్లిం పాలకుల పాలన ముగిసిన తరువాత బ్రిటిషు వారు ఈ కోటను ఆక్రమించి సైనిక కేంద్రంగా మార్చారు. బ్రిటిష్ వారు మందు గుండు సామాగ్రికి దాచుకునే గోదాంగా ఆలయ సముదాయాన్ని వాడుకున్నారు. అప్పటి కేంద్ర ప్రభుత్వం 1921 వ సంవత్సరంలో ఆలయంలో ఉన్న మసీదును రాయ వెల్లూరు కోటను, జలకంఠేశ్వరాలయాన్ని జాతీయ సంపదగా గుర్తించారు. ఆలయాన్ని పరిరక్షించడానికి పురావస్తు శాఖ అధికారులకు ప్రభుత్వం అప్పగించింది. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, ప్రజలు, పురప్రముఖులు, ఆలయాన్ని తమ స్వాధీనం చేసుకోడాకి చేయని ప్రయత్నంలేదు. మతాచార్యులు కూడా ఆలయాన్ని స్వాధీనం చేసుకోవడానికి అనేక ఉద్యమాలు చేసినా ఎలాంటి ఫలితం కనబడలేదు. అలా కొన్ని ఏండ్ల పాటు జలకంఠేశ్వరాలయం ధూప, దీప, నైవేద్యాలకు నోచుకోకుండా మూతపడి ఉండి పోయింది.

ఆలయంలో పూజలు నిర్వహించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి చివరకు 1981వ సంవత్సరంలో జిల్లా కలెక్టరు వ్వక్తిగత మద్దతుతో, తంజావూరు రామనందేద్ర సరస్వతి స్వామి, మైలారు గురూజీ సుందర స్వామి వారి మద్దతుతో జలకంఠేశ్వరాలయంలో పూజలు నిర్వహించాలనుకున్నారు. ఆ పధకంలో భాగంగా 1981 మార్చి 16న మూతపడిపోయిన వేరే ఆలయంలో ఉన్న ఓ శివలింగాన్ని ప్రముఖులు లారీలో తీసుకువచ్చారు. మరుసటి రోజు ఉదయం తొమ్మిది గంటలకు సుమారు రెండు వేలమంది ఆయలం వద్దకు చేరుకుని శివ లింగాన్ని కోటలోని ఆలయంలో ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలు చేసేశారు.

దాన్ని గమనించిన పురావస్తు శాఖ వారు పోలీసులకు, జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేయడం తప్ప ఏమీ చేయ లేక పోయారు. అయితే ఇది మత సంబంధపరమైన విషయం కావడంతో దీనిపై చర్యలు తీసుకుంటే శాంతి భద్రతల సమస్యలు పుట్టుకొస్తాయన్న భయంతో అధికారులు ఎలాంటి చర్యలకు పాల్పడలేదు. కొన్ని రోజులు గడిచిన తరువాత ఆలయ ప్రాంగణంలో అన్ని గర్భగుడులలో మతాచార్యుల మద్దతుతో విగ్రహాలను ప్రతిష్ఠించి, శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆ విధంగా వేలూరు ప్రజలు అనేక ఉద్యమాలు చేపట్టి శతాబ్దాల తరబడి మూసి ఉన్నచారిత్రక జలకంఠేశ్వరాలయాన్ని తెరిపించారు.


Next Story

Most Viewed