రియల్ వ్యాపారుల పరేషాన్

by  |
రియల్ వ్యాపారుల పరేషాన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: వివాదాలన్నింటికీ సర్వరోగ నివారిణి అంటూ ప్రవేశపెట్టిన ‘ధరణి’ కొందరి హక్కులను హరించేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కంపెనీల పేరిట భూములను కొనుగోలు చేసినవారికి ఈ పోర్టల్ శాపంగా మారిందని అంటున్నారు. వేలాది మందికి కంటి మీద కునుకు లేకుండా పోతోందని చెబుతున్నారు. ఏ అధికారి దగ్గరికి వెళ్లినా భరోసా లభించక వారు సతమతమవుతున్నా రు. వారు కొనుగోలు చేసిన భూముల డేటాను ఆన్లైన్లో నమోదు చేయలేదు. ధరణిలో నమోదు కాని ఆస్తులన్నీ ప్రభుత్వానివేనంటూ కొందరు మంత్రులు ప్రకటించారు. కంపెనీల యాజమాన్యా లకు భయం లేకపోవచ్చు. వాళ్ల దగ్గర భూములను కొనుగోలు చేసిన సామాన్యులు మాత్రం దీంతో బిత్తరపోతున్నారు. సేల్ డీడ్ ఉంది. మ్యూటేషన్ ఆర్డర్ ఉంది. ధరణిలో వారి పేర్లను, భూము లను నమోదు చేయలేదు. పట్టాదారు పాస్ పుస్తకం జారీ చేయలేదు. అడిగితే ఎవరి నుంచి కొనుగోలు చేశారో వారి పేర్లు ధరణిలో నమోదై ఉంటేనే చెల్లుబాటు అవుతుందంటూ అధికారులు భయపెడుతున్నారు. రూ.వేల కోట్ల విలువైన భూములకు హక్కులు కల్పించకుండా కాలయాపన చేయడంతో యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ చుట్టూరా, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, సూర్యాపేట, మెదక్ జిల్లాల్లో కంపెనీల పేరిట కొనుగోలు చేసిన భూములేవీ ధరణిలో నమోదుకు నోచుకోలేదని తెలుస్తోంది.

మ్యూటేషన్ చేయరా?

పలు రియల్ ఎస్టేట్ కంపెనీలు, వ్యవసాయ ఉత్పత్తుల కంపెనీలు వేలాది ఎకరాలను కొనుగోలు చేశాయి. ఆ భూములన్నింటినీ కంపెనీల పేరిటే సేల్ డీడ్స్ ఉన్నాయి. గతంలో కంపెనీల పేరిట ఉన్నప్పటికీ 1-బి, పహాణీల్లో సాగు భూములుగానే పేర్కొంటూ పట్టాదారు కాలమ్ లో కంపెనీల పేర్లు రాసేవాళ్లు. పట్టాదారు పుస్తకాలు జారీ చేసేవారు కాదు. కంపెనీల నుంచి సామాన్యులెవరై నా కొనుగోలు చేసినా, వ్యక్తి పేరిట సేల్ డీడ్స్ తో లావాదేవీలు జరిగినా రికార్డుల్లో నమోదుచేసే వాళ్లు. వారికి పట్టాదారు పుస్తకాలు జారీ చేసేవారు. కంపెనీల నుంచి అనేక మంది ఎకరం, రెండె క రాలు, మూడెకరాలుగా కొనుగోలు చేశారు. సేల్ డీడ్స్, ఇతర పత్రాలన్నింటినీ తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించారు. మ్యూటేషన్ చేయాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. అధికారులే మో ‘ధరణి’ పేరిట ఆర్నెళ్లపాటు ఆలస్యం చేశారు. భూములు విక్రయించినవారి పేర్లు ఇప్పుడు ధరణిలో లేవు. మ్యూటేషన్ చేస్తారా? లేదా? అంతుచిక్కడం లేదు. రెవెన్యూ అధికారులు కూడా సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు.

ఓ రియల్ ఎస్టేట్ సంస్థ రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలో 50 ఎకరాలు కొనుగోలు చేసింది. జీఓ 111 పరిధిలోనే వెంచర్ చేసి విక్రయించారు. ఆ కంపెనీ ధరణిలో నమోదు కాలేదు. నగరానికి దగ్గరలోనే తక్కువ ధరకు ప్లాట్లు వస్తున్నాయన్న ఆశతో పలువురు కొనుగోలు చేశారు. ఇప్పుడు ఇటు రిజిస్ట్రేషన్లు కాక, అటు ధరణిలోకి కంపెనీల భూములు నమోదు కాక సతమతమవుతున్నారు. డబ్బులు తిరిగి చెల్లించడం కంపెనీ వల్ల కాదు. కంపెనీ కొనుగోలు చేసిన భూములు రైతులు తిరిగి తీసుకోరు. రైతులు సిద్ధంగా ఉన్నా చెల్లించిన ధర ఇచ్చే పరిస్థతి లేదు. ఇప్పుడేం చేయాలో అంతుచిక్కక ఆ రియల్ ఎస్టేట్ సంస్థ యజమాని ఆందోళనలో ఉన్నారు. ఫాం అసోసియేషన్లు, కంపెనీల నుంచి వ్యవసాయ భూములుగానూ కొనుగోలు చేసిన వ్యక్తులు ఉన్నారు. వారి పరిస్థితి ఏమిటో తెలియడం లేదు. వికారాబాద్ జిల్లాలో ఓ ప్రధాన రియల్ ఎస్టేట్ కంపెనీ 300 ఎకరాల వరకు కొనుగోలు చేసింది. వారి వివరాలే ధరణిలో నమోదు చేయలేదు. యాదాద్రి, రంగారెడ్డి జిల్లాల్లో వందలాది ఎకరాలను ఓ సంస్థ కొనుగోలు చేసింది. ఈ భూములను ధరణిలో నమోదు చేయలేదని తెలిసింది. యాదాద్రి, షాద్ నగర్, ఆమనగల్లు, చౌటుప్పల పరిసరాల్లో ఈఎంఐ ప్రాతిపదికన ప్లాట్లు విక్రయించే సంస్థల వేలాది ఎకరాల భూములు ఉన్నాయి. నాలా కన్వర్షన్ చేసుకోని భూములను ధరణిలో నమోదు చేయలేదు.

అవకాశం ఉన్నా

ఆర్వోఆర్ లో కంపెనీల భూములన్నింటినీ నమోదు చేసేవారు. కంపెనీలకు ఆధార్ ఉండదన్న నెపంతో ధరణిలో నమోదుకు బ్రేకులు వేశారు. కంపెనీ ఆథరైజ్డ్ పర్సన్ ఆధార్ నంబరుతో నమోదు చేయొచ్చునని, లేదంటే కంపెనీ డైరెక్టర్లందరూ కలిసి సమర్పించే అఫిడవిట్ ఆధారంగా ఎండీ ఆధార్ నంబరును సీడ్ చేసి కంపెనీ పేరిటే రికార్డుల్లో నమోదు చేయొచ్చునని పలువురు రెవెన్యూ అధికారులు సూచించారు. ఉన్నతాధికారులు మాత్రం ఈ రెండు సూచనలను పక్కకు పెట్టారు. రంగారెడ్డి జిల్లాలో కొందరు తహసీల్దార్లు మాత్రం కంపెనీల ఆథరైజ్డ్ పర్సన్ ఆధార్ నంబరుతో సీడ్ చేసినట్లు సమాచారం.

అనాలోచిత నిర్ణయాలు

పోర్టల్ లో లేని భూముల క్రయ విక్రయాలు చెల్లవని ప్రభుత్వం స్పష్టం చేసింది. డబ్బులు పెట్టి, స్టాంపు డ్యూటీ కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్న తమ భూముల డేటా నమోదు చేయకపోవడం పట్ల కంపెనీల యజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కంపెనీల కంటే వాటి నుంచి కొనుగోలు చేసిన వ్యక్తులు ఆందోళనకు గురవుతున్నారు. ఇక నుంచి సదరు భూములను ఎట్లా అమ్ముకోవాలని కంపెనీలు ప్రశ్నిస్తున్నాయి. ఉన్నతాధికారుల అనాలోచిత నిర్ణయాల వల్ల హెచ్ఎండీఏ పరిధిలో వేలాది ఎకరాల భూమి సందిగ్ధావస్థలో పడింది.

Next Story