టాప్ గేర్ వేసిన జనగామ ఆర్టీసీ డిపో.. దసరాకు రికార్డు స్థాయి కలెక్షన్లు!

by  |
టాప్ గేర్ వేసిన జనగామ ఆర్టీసీ డిపో.. దసరాకు రికార్డు స్థాయి కలెక్షన్లు!
X

దిశ, జనగామ : జనగామ ఆర్టీసీ డిపోకు రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరినట్లు డిపో మేనేజర్ లక్ష్మీ ధర్మ తెలిపారు. మంగళవారం డిపో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో దసరా పండుగను పురస్కరించుకుని వచ్చిన ఆదాయాన్ని ఆయన ప్రకటించారు. పండుగ నేపథ్యంలో ఉండే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని జనగామ డిపో నుంచి వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బస్సులను పెంచినట్టు గుర్తుచేశారు.

అంతేకాకుండా, ఒక్క రూపాయి కూడా అదనంగా వసూలు చేయకుండా పాత చార్జీలతోనే రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరడం చాలా సంతోషకరమైన విషయమని అన్నారు. జనగామ డిపో నుంచి జగద్గిరిగుట్టకు 25, ఉప్పల్ 15, హనుమకొండకు 28 , సిద్దిపేటకు 12 , సూర్యాపేటకు 8 అదనపు ట్రిప్పుల చొప్పున బస్సులను నడిపించినట్టు తెలిపారు. సద్దుల బతుకమ్మ, దసరా పండుగ కోసం ప్రత్యేకంగా 8 నుంచి 18వ తేది వరకు నడిపించిన బస్సుల ద్వారా వచ్చిన ఆదాయ వివరాలను ప్రకటించారు. రోజులు, ఆదాయం వారీగా మొత్తం ఎంత వచ్చిందంటే..

తేదీ ఆదాయం
08 13,02,677
09 12,66,290
10 12,52,325
11 16,44,428
12 14,75,743
13 14,57,179
14 12,54,924
15 5,81,430
16 9,85,855
17 15,81,776
18 20,49,746

మొత్తంగా ఒక 1 కోటి 48 లక్షల 52 వేల 373 రూపాయల ఆదాయం సమకూరిందని డిపో మేనేజర్ వెల్లడించారు. గతంతో పోలిస్తే ఈసారి రూ. 20 లక్షల ఐదు వేల ఆదాయం అధికంగా సమకూరిందన్నారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఈ స్థాయిలో ఆదాయం రావడం మంచి విషయమని డీఎం లక్ష్మీ ధర్మ తెలిపారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచనల మేరకు జనగామ డిపో సిబ్బంది ఈ ఫీట్ సాధించినట్టు వివరించారు. ఎండీ సూచనల మేరకు క్రమంతప్పకుండా విధులకు హాజరైన ఆర్టీసీ ఉద్యోగులు అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో సీఐ శ్రీకాంత్ కార్యాలయ సిబ్బంది ఉన్నారు.

Next Story

Most Viewed