దేశంలో తగ్గిన బిలీయనీర్లు..

by Jakkula Samataha |   ( Updated:2021-08-10 07:38:42.0  )
billionire
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశీయంగా అపరకుబేరుల సంఖ్య గతం కంటే కొంత తగ్గింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో మొత్తం 141 మంది బిలీయనీర్లు ఉండగా, 2020-21లో ఇది 136కి తగ్గినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం రాజ్యసభలో తెలిపారు. ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలులో రూ. 100 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం వెల్లడించిన వ్యక్తులను ఈ జాబితాలో చేరుస్తారు. 2018-19లో వీరి సంఖ్య 77 ఉండగా, ఇప్పుడు రెట్టింపునకు పెరిగిందని ఆమె పేర్కొన్నారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ) వద్ద అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, 2016 నుంచి సంపద పన్నును రద్దు చేయడం వల్ల కుబేరుల పూర్తి సంపదకు సంబంధించి వివరాలు సీబీడీటీ వద్ద లేదని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

అలాగే, అధికారిక లెక్కల ప్రకారం.. భారత్‌లో దారిద్యరేఖకు దిగువన నివశిస్తున్న వారి సంఖ్య 2011-12లో 27 కోట్లు(21.9 శాతం)గా అంచనా వేసినట్టు చెప్పారు. ప్రభుత్వం ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్’ ప్రాధాన్యత ఇవ్వడంతో ప్రజల జీవన నాణ్యత మెరుగుపడిందని, అభివృద్ధి లక్ష్యంగా వివిధ పథకాలను ప్రారంభించినట్టు చెప్పారు. నిత్యావసరాల ధరలకు సంబంధించి స్పందించిన ఆమె.. దేశీయంగా ధరల పరిణామాలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. ధరల స్థిరత్వం కోసం అవసరమైన చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు వంటనూనెలపై దిగుమతి సుంకాన్ని తగ్గించామని, పప్పు ధాన్యాల నిల్వలపై పరిమితిని విధించినట్టు వెల్లడించారు. అలాగే, ప్రస్తుత ఏడాది జూలై రెండో వారం నాటికి 1.33 లక్షల మందికి సెక్యూరిటీ లేని రుణాలు ఇచ్చామన్నారు. అంతేకాకుండా, గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో మోసాలు 568 నుంచి 323కి తగ్గిందన్నారు. రాష్ట్ర సహకార బ్యాంకుల్లో 482కి తగ్గినట్టు చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed