ఇసుక మాఫియాపై క‌న్నేయండి

by Sridhar Babu |
ఇసుక మాఫియాపై క‌న్నేయండి
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం : ఇసుక మాఫియాపై భారీ జరిమానాలు విధించడంతో పాటు వాహనాలను స్వాధీనం చేసుకుని క్రిమినల్ కేసులు బుక్ చేయాలని మైనింగ్, రెవిన్యూ అధికారులను జిల్లా కలెక్టర్ డా. ఎంవీ రెడ్డి ఆదేశించారు. ఇసుక, మట్టి అక్రమ రవాణా, బోరు బావుల త్రవ్వకం, ప్రభుత్వ భూ ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు మొదలైనవన్ని చట్టవిరుద్ధమైన కార్యకలాపాలని తెలిపారు. ఈ విషయంలో ఏదైనా నిర్లక్ష్యం జరిగితే సంబంధిత వీఆర్‌ఏలు, వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీవోలు, ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లు, తహశీల్దార్లుపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చ‌రించారు. గ్రామ స్థాయి నుంచి గట్టి నిఘా నిర్వహించాలని చెప్పారు.

పండుగ సెలవు, తదుపరి ఆదివారం సెలవు వల్ల జిల్లా యంత్రాగం అందుబాటులో ఉండదనే సమాచారంతో మాఫియా మరింత రెచ్చిపోయే అవకాశం ఉందని అన్నారు. అధికారులు మరింత అప్రమత్తంగా పర్యవేక్షణ చేయాలని సూచించారు. జిల్లా అధికారులతో మండల ప్రత్యేక అధికారులు ముఖ్యంగా ఆర్డీఓ, సబ్ కలెక్టర్, డీఎల్‌పీఓలు, డీపీఓ, డీఆర్‌ఓ, అదనపు కలెక్టర్లు నిశిత పర్యవేక్షణ చేయాలని చెప్పారు.

వచ్చే సోమవారం నిర్వహించనున్న జిల్లా అధికారుల సమీక్షా సమావేశంలో ఈ విషయాలపై వివరణాత్మక సమీక్ష నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. క్రాకర్లు విక్రయాలు నిషేధించిన కారణంగా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై భారీ జరిమానాలు విధించడంతో పాటు కేసులను బుక్ చేయాలని తెలిపారు. ఈ విషయంలో తీసుకున్న చర్యలపై ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వాల్సి ఉన్నదని కావున సోమవారం వరకు నివేదికలు తయారు చేయాలని ఆయన చెప్పారు.



Next Story

Most Viewed