అన్ని అక్రమాలకు పునాది ‘హెచ్ఎండీఏ’

by  |
Illegal Structures
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో అక్రమ నిర్మాణాల సంఖ్య ఎంత? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హెచ్ఎండీఏ, రెరా సంస్థలు ఎన్ని అక్రమ నిర్మాణాలను కూల్చేశారు? ఎన్ని సంస్థలకు జరిమానాలు విధించారు? ఎన్ని భవన నిర్మాణ సంస్థలను బ్లాక్​లిస్టులో పెట్టారు? ఇప్పుడిదే చర్చ రియల్​ఎస్టేట్​వర్గాల్లో సాగుతోంది. పీఓబీ జాబితాలో ఉండగా క్రయ విక్రయాలకు అనుమతి ఇచ్చిన రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులపై ఏమైనా చర్యలు తీసుకుంటారా? అలాగైతే చేతులు మారిన భూముల వ్యవహారంలో నష్టపోయేదెవరు? అంటూ పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మాజీ మంత్రి ఈటల రాజేందర్​కేంద్రంగా దేవరయంజాల్​ఆలయ భూముల్లో అక్రమ నిర్మాణాలపై సాగుతోన్న దర్యాప్తుపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఒక్క చిన్న ఊరిలోనే 1500 ఎకరాల ఆలయ భూముల్లోనే యథేచ్ఛగా 200లకు పైగా అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు దర్యాప్తు కమిటీలోని నలుగురు ఐఏఎస్​అధికారుల బృందం తేల్చింది. మరి మిగతా గ్రామాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో అక్రమాల సంఖ్య ఏ స్థాయిలో ఉంటుందో అంచనా వేయొచ్చు. ఈ నిర్మాణాలన్నీ కొనసాగుతుంటే స్థానిక అధికారులు ఏం చేశారు? హెచ్ఎండీఏ, రెరా వంటి సంస్థలు ఏం చేశాయని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. పైగా మంత్రి కేటీఆర్​పరిధిలోని పురపాలక శాఖలోనే అంతులేని నిర్లక్ష్యం కారణంగా అక్రమాల పునాదులు నిర్మించారు. అధికారుల నిర్లక్ష్యం, నాయకుల ఒత్తిళ్లు ఆ శాఖ మంత్రి కేటీఆర్​ను ఇబ్బందికి గురి చేసే అంశంగా మారిందంటున్నారు.

Illegal Structures1

అక్రమ నిర్మాణాలను ఉక్కుపాదంతో అణచివేసేందుకు అమల్లోకి తీసుకొచ్చిన కొత్త మున్సిపల్​చట్టాలను అమలు చేస్తే ఈ లెక్క వందల్లో ఎందుకు ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం నియమించిన ఐఏఎస్​ల బృందం తేల్చిన అక్రమ నిర్మాణాల లెక్కలు కాంగ్రెస్, బీజేపీలకు అస్త్రాలుగా మారాయి. మాజీ మంత్రి ఈటల బినామీలు అంటూ నమోదు చేసుకున్న నిర్మాణాలెవరివో స్థానికులందరికీ తెలుసు. ఫంక్షన్​హాళ్లు, గోడౌన్ల నిర్మాణాలన్నీ ఎవరు చేపట్టారో, ఎవరు ఆ భూములను అనుభవిస్తున్నారో దర్యాప్తులో తేలనుంది.

కానీ ఈటల గోడౌన్లను మాత్రమే అక్రమాలని తేల్చి మిగతా వాటికి క్లీన్​షీట్​ఇవ్వడం అసాధ్యం. దీంతో పాటు ఒక్క దేవరయంజాల్​ఆలయ భూములతోనే విచారణ, చర్యలకు బ్రేకులు వేసినా ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని రియల్​ఎస్టేట్​నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రతి గ్రామంలోని అనేక ఫంక్షన్​హాళ్లు, రీసార్టుల్లోని భవంతులు, ఫాంహౌజ్ లు, గోడౌన్లకు ఎలాంటి అనుమతులు లేవు. వాటిపై చర్యలు తీసుకోకుండా దేవరయంజాల్​తోనే నిలిపివేస్తే ప్రతిపక్షాలకు అస్త్రశస్త్రాలు అందించినట్లేనని తెలుస్తోంది.

అంతటా అక్రమాలే

దేవరయంజాల్​ఆలయ భూములతో పాటు పట్టా భూముల్లోనూ అక్రమ పునాదులు అనేకం దర్శనమిస్తున్నాయి. ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలలు కూడా చెరువు శిఖం, బఫర్​జోన్లలోనే నిర్మించారని మల్కాజిగిరి ఎంపీ రేవంత్​రెడ్డి ఆధారాలు చూపిస్తున్నారు. అసైన్డ్​భూముల్లోనూ బహుళ అంతస్థుల భవనాలు నిర్మించిన వారిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్​వినిపిస్తోంది. ఐతే మేడ్చల్​జిల్లాలోని శామీర్ పేట, కీసర, బోడుప్పల్, జవహర్​నగర్, కుత్బుల్లాపూర్, పోచారం, నిజాంపేట, ఘట్​కేసర్​మండలాల్లోనూ అనుమతి లేని వెంచర్లు, భవనాలు, గోడౌన్లు, ఫంక్షన్ హాళ్లు వందల్లోనే దర్శనమిస్తున్నాయి. కనీసం ఆస్తి పన్ను చెల్లించని గోడౌన్లు, ఫంక్షన్​హాళ్లు కూడా అనేకం ఉన్నాయి.

అలాగే ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్, పటాన్​చెరు, షాద్ నగర్, చేవెళ్ల, మహేశ్వరం, భువనగరి నియోజకవర్గాల్లోనూ ప్రజాప్రతినిధులు, నాయకుల అనుమతి లేని భవనాలు, ఫంక్షన్​హాళ్లు అనేకం ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పుడీ అక్రమాలపై మంత్రి కేటీఆర్ ఆదేశాల కోసం అధికారులు ఎదురుచూస్తున్నట్లు సమాచారం.

దేవరయంజాల్​తో పాటు మిగతా ప్రాంతాల్లోని అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకునేందుకు పటిష్టమైన వ్యవస్థను రూపొందించకపోతే నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని ఓ రిటైర్డ్​అధికారి అభిప్రాయపడ్డారు. పురపాలక శాఖ, హెచ్ఎండీఏ, రెరా సంస్థలు నిరంతరంగా పని చేస్తుంటే వీటి సంఖ్యను నియంత్రించగలిగే వారన్నారు. పూర్తి స్థాయి అధికారులు లేకపోవడం, సిబ్బంది కొరత ఉండడం కూడా అక్రమాలపై ఉదాసీనతకు కారణాలుగా ఉన్నాయని వివరించారు.

Illegal Structures2

ఎక్కడ జిల్లాకో టాస్క్ ఫోర్స్?

కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ప్రతి జిల్లాకో టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ మేరకు జిల్లా స్థాయి ఎన్ఫోర్స్​మెంట్​స్క్వాడ్స్​ను ఏర్పాటు చేయాలని ఫిబ్రవరిలో ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రత్యేక బృందం అనధికారిక లేఅవుట్లను, అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపాలి. టీఎస్​బీపాస్​విధానంలో భాగంగా ఈ డిస్ట్రిక్ట్​టాస్క్ ఫోర్స్(డీటీఎఫ్) పని చేస్తోంది. ఈ బృందానికి కలెక్టర్​నేతృత్వం వహిస్తారు. రెవెన్యూ, పోలీసు, ఫైర్, రోడ్లు భవనాల శాఖ అధికారులు ఉంటారు. ఔట్​సోర్సింగ్ ద్వారా అక్రమ కట్టడాలను కూల్చేస్తారు. అక్రమ నిర్మాణాల సంఖ్యను బట్టి స్క్వాడ్స్​ను ఏర్పాటు చేసుకోవచ్చు.

ఈ కమిటీ టీఎస్​బీ పాస్​పోర్టల్, కాల్​సెంటర్, మొబైల్​యాప్స్, సోషల్​మీడియా ద్వారా ఫిర్యాదులను స్వీకరించొచ్చు. ఫిర్యాదులను స్వీకరించిన మూడు రోజుల్లోనే క్షేత్ర స్థాయి పరిశీలన చేయాలి. అక్రమాలని తేలితే వెంటనే కూల్చేయాలి. వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీతో చిత్రీకరించాలి. ఏమేం అక్రమాలు ఉన్నాయో, ఏమేం ఉల్లంఘనలు జరిగాయో పంచనామాలో పేర్కొనాలి. ఐతే కూల్చివేతకు ముందు నోటీసులు జారీ చేయాలి. ఖర్చులు కూడా యజమాని నుంచే వసూలు చేయాలి. అలాగే అక్రమ నిర్మాణాలు, వెంచర్ల సమాచారాన్ని రిజిస్ట్రేషన్ల శాఖకు జిల్లా టాస్క్​ఫోర్స్​అధికారులు అందించాలి. వాటన్నింటిని వెంటనే పీఓబీ జాబితాలోనూ నమోదు చేయించాలి. అక్రమ నిర్మాణాలకు నీటి కనెక్షన్లు, విద్యుత్తు కనెక్షన్లు ఇవ్వకుండా చర్యలు చేపట్టాలి. ఈ వివరాలన్నింటినీ డైరెక్టరేట్​ఆఫ్​టౌన్​అండ్​కంట్రీ ప్లానింగ్​కు ఫిబ్రవరి 18 వరకు పంపాలని సూచించారు. కానీ ఇప్పటి వరకు ఏ జిల్లాలోనూ టాస్క్ ఫోర్స్​కమిటీలు యాక్షన్​లోకి దిగిన దాఖలాలు కనిపించడం లేదు.

రెండేండ్లుగా అక్రమాలు

రెండేండ్ల నుంచి హెచ్ఎండీఏకు పూర్తి స్థాయిలో పని చేసే కమిషనర్ లేకపోవడం వల్ల పాలన గాఢి తప్పిందని రియల్​ఎస్టేట్ వర్గాలు ఆరోపిస్తున్నారు. అలాగే మూడేండ్ల నుంచి పూర్తి స్థాయిలో డైరెక్టర్లు కూడా లేరు. సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఒకరిద్దరు అధికారులు రిటైర్ అయ్యారు. వారి స్థానంలో సరైన అధికారులు లేరన్న విమర్శలు ఉన్నాయి. ఉన్నత స్థాయిలో అనుభవం కలిగిన సిబ్బంది లేకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. టీఎస్​బీ పాస్ విధానంలో అన్నీ ఒకే చోట లభించాలి. కానీ ఇప్పటికీ ఎన్వోసీ, ఇతర పనుల కోసం అన్ని విభాగాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అలాగే పెరుగుతోన్న అక్రమ నిర్మాణాలను నియంత్రించేందుకు వ్యవస్థ లేకుండా పోయిందన్న ఆరోపణలు ఉన్నాయి.

వాటిని కూల్చేసేందుకు ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు పూర్తి స్థాయిలో బాధ్యతలను అప్పగించింది. అక్రమ నిర్మాణాలపై గత నెలలోనూ హైకోర్టు పలు సూచనలు చేసింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకునేందుకు పూనుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. హెచ్ఎండీఏ కమిషనర్ గా పురపాలక శాఖ ప్రిన్సిపల్​సెక్రటరీ అర్వింద్​కుమార్ అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి రోజుల్లో అక్రమ నిర్మాణాలపై సాగించిన ఉక్కుపాదం ఇప్పుడు కనిపించడం లేదు. అందుకే దేవరయంజాల్​లో మాత్రమే కాదు. ప్రతి ఊరిలోనూ అక్రమాలకు హెచ్ఎండీఏ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతోనే పునాది రాయి పడుతోందని రియల్​ఎస్టేట్​నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ​

Next Story