ఆ జిల్లాను ముంచెత్తిన భారీ వర్షాలు.. జలదిగ్బంధంలో పలు గ్రామాలు

by  |
ఆ జిల్లాను ముంచెత్తిన భారీ వర్షాలు.. జలదిగ్బంధంలో పలు గ్రామాలు
X

దిశ,పాలేరు: నియోజకవర్గంలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఖమ్మం జిల్లాలో పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా చాలావరకు లోతట్టు పంట పొలాలు నీట మునిగాయి. పంట పొలాల్లోకి వరద నీరు చేరడంతో అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు. నాలుగు రోజులుగా జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగుతుంది. వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కూసుమంచి, తిరుమలాయపాలెం, రూరల్ మండలంలో భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కూసుమంచి మండలం ఈశ్వరమాధారం, రాజుపేట గ్రామాలకు, జిల్లా నుంచి సంబంధాలు దాదాపు తెగిపోయాయి.

నర్సింహులగూడెం, కొత్తూరు, చౌటపల్లి, ఎర్రగడ్డ తండా గ్రామాలకు కూసుమంచి మండల కేంద్రానికి రావడానికి నాన్ తండా వద్ద ఉన్న వాగు, అటు నర్సింహులగూడెం వద్ద గొల్ల వాగు ఉధృతికి పూర్తిగా మునిగిపోయాయి. ఇక తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు ముత్యాలమ్మ కుంట నిండి ప్రమాదభరితంగా పొంగి రోడ్డుపైకి వరద వస్తుంది. దీనితో రోడ్డు కోతకు గురై కట్ట తెగిపోయే ప్రమాదం ఉంది. దీనితో కూసుమంచి సీఐ సతీష్ వర్షాల నేపథ్యంలో వాగులు పొంగుతున్నాయని, ప్రజలు, రైతులు ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

లో లెవల్ కాజ్ వేలు వద్ద రోడ్డు దాటే ప్రయత్నాలు చేయవద్దని సూచించారు. పాలేరు జలాశయం 24 గేట్ల ద్వారా నీరు దిగువకు వెళ్తున్న నేపథ్యంలో రైతులు, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. నర్సింహులగూడెం నుండి వివిధ గ్రామాలకు వెళ్ళే ప్రధాన రహదారిపై అటు నాయకన్ గూడెం- కోదాడ రోడ్లపై నీరు ఉదృతంగా ప్రవాహం ఉందన్నారు. పోలీసు, రెవెన్యూ సిబ్బందితో గస్తీ ఏర్పాటు చేసి పరిశీలిస్తున్నారని తెలిపారు.



Next Story

Most Viewed