పనితీరును బట్టి ప్రమోషన్లు.. ఉద్యోగులకు మంత్రి హరీష్ సూచన

by  |
పనితీరును బట్టి ప్రమోషన్లు.. ఉద్యోగులకు మంత్రి హరీష్ సూచన
X

దిశ, తెలంగాణ బ్యూరో: పనితీరులో నెలవారీగా వృద్ది కనిపించాలని, పదోన్నతులు, ప్రోత్సాహకాలకు అదే గీటు రాయి అని ఆరోగ్యశాఖ మంత్రి హరీష్​రావు తేల్చి చెప్పారు. అందరూ ఉత్సాహంగా పని చేయాలని, ఎలాంటి సమస్యలున్నా పరిష్కరించేందుకు ప్రభుత్వం వైద్యసిబ్బంది వెంట ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. పనిచేసే వారికి ప్రభుత్వం అన్ని రకాలుగా మద్ధతునిస్తుందన్నారు. ఇక నుంచి వైద్యారోగ్యశాఖలోని విభాగాల వారీగా ప్రతీ నెల రివ్యూలు చేస్తానని ఆయన సూచించారు. కోఠి ఆరోగ్యశాఖ కార్యాలయంలో శనివారం కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్​ వాకాటి కరుణతో పాటు, ఆశ, మెటర్నల్ హెల్త్, చైల్డ్ హెల్త్, మిడ్ వైఫెరీ, అర్ బి ఎస్ కే, హెచ్ ఎం ఐ ఎస్, టీబీ, టీ – డయాగ్నొస్టిక్స్, 108, 104, యూ పి హెచ్ సి, సాంక్రమిక, అసంక్రమిక వ్యాధులు, పల్లె దవాఖానలు, పి హెచ్ సీ లు, వాక్సినేషన్ తదితర విభాగాల ముఖ్య అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్​రావు మాట్లాడుతూ… విభాగాల వారీగా సిబ్బంది పనితీరుపై రిపోర్టులు కోరారు. హెచ్ఓడీలు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను పరిష్కరించాలన్నారు. ఆరోగ్య తెలంగాణ కల సాకారం కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఇప్పటికే ఆరోగ్య సూచీల్లో రాష్ట్ర సగటు కంటే తక్కువ పని తీరు ఉన్న జిల్లాల్లో పురోగతి సాధించాలన్నారు. ఆ దిశగా అధికారులు సత్వర చర్యలకు సిద్ధం కావాలన్నారు.

కార్యక్రమాలు క్షేత్రస్థాయిలోకి వెళ్లాలి

ప్రభుత్వం పెద్ద మొత్తంలో ప్రజారోగ్యానికి నిధులు ఖర్చు చేస్తున్నదని, అదే స్థాయిలో ఆరోగ్య కార్యక్రమాల అమలులో శ్రద్ద చూపించాలన్నారు. రక్తహీనత విషయంలో రాష్ట్రం మరింత మెరుగ స్థితిలో ఉండాల్సి ఉందని, ఈ పరిస్థితిలో మార్పు రావాలన్నారు. దీంతో పాటు రాష్ట్రంలో మలేరియా, డెంగ్యూ ప్రభావిత జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ మేరకు పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖలతో సమన్వయం చేసుకుంటూ పరిసరాల పరిశ్రుభ్రతను మెరుగు పరుస్తూ, దొమల నివారణ చర్యలు చేపట్టాలన్నారు. తద్వారా వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చని చెప్పారు.

ప్రసూతి మరణాలు తగ్గాలి

ప్రసూతి మరణాలు తగ్గించేందుకు కృషి చేయాలని, ఆస్పత్రి ప్రసవాలను 97 శాతం నుండి 100 శాతానికి పెంచడమే లక్ష్యంగా పని చేయాలన్నారు. దీనిలో ఎక్కువగా ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాలు అయ్యేలా చూడాలని, అది సాధారణ ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రసూతి మరణాలు తగ్గించే విషయంలో దేశంలో మనం నాల్గవ స్థానంలో ఉన్నామని, మొదటి స్థానంలోకి వచ్చేలా అందరం ఒక నిర్ధిష్టమైన ప్రణాళికతో పని చేద్దామని పిలుపునిచ్చారు.

రెండు వారాల్లో పూర్తికావాలి

రెండు వారాల్లో గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో క్యాథ్ లాబ్స్ సిద్దం కావాలన్నారు. దీంతో పాటు వచ్చే నెల రెండో వారంలోగా ఖమ్మంలోని క్యాథ్ ల్యాబ్ పనులు పూర్తి చేసి, ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. దీంతో పాటు ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు, ఇతర వివరాలను ఎప్పటికప్పుడు ఆరోగ్య శాఖ ఆన్ లైన్ ( హెచ్ ఐ ఎం ఎస్ )లో నమోదు చేయాలన్నారు. మరోవైపు పల్లె దవాఖానాల ఏర్పాటు వేగంగా పూర్తి చేయాలన్నారు.


Next Story

Most Viewed