ఆ మంత్రిపై ఎమ్మెల్యేల గుర్రు.. మాపై ఆయన పెత్తనమేంది ?

by  |
ఆ మంత్రిపై ఎమ్మెల్యేల గుర్రు.. మాపై ఆయన పెత్తనమేంది ?
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ ఎన్నికల కోసం వేగంగా పావులు కదుపుతోన్న అధికార పార్టీ.. కార్పొరేటర్ల పనితీరుపై సైతం రిపోర్టు రెడీ చేసినట్లు తెలుస్తోంది. వరద సాయం పరిహారం మింగేసిన కార్పొరేటర్లకు చెక్ పెడతామని ఇప్పటికే మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పినట్టు గుసగుసలు వినిపిస్తుండగా.. వరుసగా రెండ్రోజులు గ్రేటర్ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలతో కేటీఆర్ భేటీ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారని తెలుస్తుండగా ఈ భేటీలో ఎమ్మెల్యేలు ఓ మంత్రిపై ఘాటుగా విమర్శలు చేసినట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కార్పొరేటర్లకు టికెట్ల బాధ్యత తనదేనని, తన వర్గంలోనే ఉండాలని, గ్రేటర్ మొత్తం తన గుప్పిట్లోనే ఉందని, ఎన్నికల ప్రక్రియ మొత్తం తన భుజాలపైనే వేశారంటూ ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా ఆయా సెగ్మెంట్ల పరిధిలోని కార్పొరేటర్లు, పార్టీ నేతలను పిలిపించుకుని మాట్లాడుతున్నారంటూ మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదు చేసినట్టు హాట్ హాట్‌గా నడుస్తోన్న టాక్.

ఈ బోడి పెత్తనమేంది..?
ఇటీవల మంత్రి తలసాని అంతా తానై గ్రేటర్‌ పరిధిలో వ్యవహారాలు చక్కదిద్దుతున్నట్టు ఇమేజ్ క్రియేట్ అయింది. ఆయన తన నియోజకవర్గంలో కాకుండా ఇతర నియోజకవర్గాల పరిధిలో గ్రేటర్ ఎన్నికల అంశాన్ని చర్చిస్తున్నారంటూ ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారట. కార్పొరేటర్ టికెట్ ఇప్పించే బాధ్యత తనదేనంటూ నేతలకు హామీ ఇస్తున్నారని, కేవలం ఒకవర్గాన్నిమాత్రమే ప్రోత్సహిస్తున్నారని మల్కాజిగిరి, ఉప్పల్ పరిధిలో ఎమ్మెల్యేలు ఆధారాలను చూపిస్తూ మంత్రి తలసాని వైఖరిపై ఫిర్యాదు చేసారని తెలుస్తోంది. అయితే కొంతమంది కార్పొరేటర్లు వరద సాయాన్ని పూర్తిగా దిగమింగారని వ్యతిరేకవర్గం కూడా ఫిర్యాదులు చేశారని, ఆ అంశాన్ని మంత్రి కేటీఆర్ సైతం సదరు ఎమ్మెల్యేలకు వివరించి కూల్ చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో స్థానిక పరిస్థితులను అంచనా వేసుకుని తామే తీసుకుంటామని, ఇలాంటి అంశాల్లో మంత్రి తలసాని బోడి పెత్తనమేమిటంటూ దూషణలపర్వానికి దిగినట్టు వెల్లడవుతోంది. అయితే ఈ సమావేశంలో మంత్రి తలసాని లేకపోవడంతో తర్వాత మాట్లాడుదామని మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యేలను సముదాయించారని తెలుస్తోంది.

మేమే టికెట్లు ఇచ్చుకుంటాం..
గ్రేటర్ ఎన్నికల్లో పరిస్థితులు అనుకూలంగా లేవని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌కు నివేదిక ఇచ్చినట్టు అంతర్గత వర్గాల సమాచారం. ప్రస్తుతం ఆరోపణలతో టికెట్ల విషయాల్లో కఠినంగా నిర్ణయాలు తీసుకుంటే పార్టీకి నష్టం వస్తుందని, దీనిపై స్థానిక ఎమ్మెల్యేలకు బాధ్యతలను ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది. స్థానిక పరిస్థితులను అంచనా వేసుకుని టికెట్లు కేటాయించుకుంటామని, దీనిలో ఎమ్మెల్యే అభిప్రాయం తప్పకుండా తీసుకోవాలని విన్నవించుకున్నారట. అయితే దీనిపై మంత్రి కేటీఆర్ సానుకూలంగా సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. పలు ఆరోపణలతో టికెట్ వద్దనుకుంటున్నవారికి ఎలా ఇస్తామని, దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుందామని ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చినట్లు సమాచారం.


Next Story