పన్ను రహిత బాండ్‌ల నుంచి రూ. 10 వేల కోట్ల సమీకరణ లక్ష్యం!?

by  |
పన్ను రహిత బాండ్‌ల నుంచి రూ. 10 వేల కోట్ల సమీకరణ లక్ష్యం!?
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 వల్ల కేంద్రానికి పన్ను వసూళ్లు భారీగా తగ్గాయి. ఈ నేపథ్యంలో ఆర్థికంగా ఏర్పడిన అంతరాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం కీలక చర్చలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా పన్ను రహిత బాండ్‌లను జారీ చేసిన రూ. 10 వేల కోట్లను సమీరించాలని భావిస్తోంది. దీనికోసం సదరు బ్యాంకర్లతో ఆర్థిక మంత్రిత్వ శాఖ పన్ను రహిత బాండ్‌ల జారీ కోసం చర్చలు జరుపుతున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇవి కాకుండా సెంట్రల్ బ్యాంక్ నుంచి వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ ద్వారా తాత్కాలిక నిధులను సేకరించాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది. ఇది స్వల్పకాలిక రుణాల విండో అయినప్పటికీ తక్షణావసర ఖర్చులకు ఇవి సరిపోకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, ఎన్ని వాయిదాల్లో ఈ పన్ను రహిత బాండ్‌లను ఇవ్వాలనేది ఇంకా నిర్ణయించలేదు.

పబ్లిక్ సెక్టార్ సంస్థల ద్వారా కానీ, నేరుగా బాండ్‌ల జారీ చేయడం జరుగుతుంది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్స్, ఆర్ఈసీ, ఎన్‌టీపీసీలు కొన్నేళ్ల క్రితమే పన్ను రహిత బాండ్‌లను విక్రయించాయి. ప్రస్తుతం ఆర్థిక మంత్రిత్వ శాఖ, నీతి అయోగ్‌లు ప్రధాన మంత్రి కార్యాలయంతో కలిసి పన్ను రహిత బాండ్‌లను విక్రయించేందుకు చర్చలు జరుపుతున్నాయి. అయితే, ఈ అంశంపై నీతి అయోగ్ కానీ, ప్రభుత్వం కానీ ఎలాంటి స్పష్టత, అధికారిక ప్రకటన ఇవ్వలేదు.

పదేళ్ల కాల పరిమితి ఉన్న బాండ్‌లను తీసుకోవడం వల్ల 5.5 శాతం వడ్డీతో సహా, పన్ను పరిధిలోకి వచ్చే వారు పన్ను కట్టాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల పన్ను మొత్తం కలిపినా పన్ను రహిత బాండ్‌లపై 7.7 శాతం రాబడి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పెట్టుబడిదారులకు మ్యూచువల్ ఫండ్‌లకు బదులుగా పన్ను రహిత బాండ్‌లు లాభాలు ఇస్తాయని చెబుతున్నారు. సాధారణంగా కేంద్రం ఆర్‌బీఐ నుంచి డెట్ మార్కెట్లో ప్రతి వారం సెక్యూరిటీల వేలం ద్వారా నిధులను సేకరిస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 5.11 లక్షల కోట్ల సమీకరణ లక్ష్యంగా పెట్టుకుంది. స్థూల రుణాలు గతేడాదిలో ఉన్న రూ. 7.1 లక్షల కోట్ల నుంచి రూ. 7.8 లక్షల కోట్లకు పెరిగినట్టు తెలుస్తోంది. తక్కువ పన్ను వసూళ్ల కారణంగా ద్రవ్య కొరత ఖచ్చితంగా ఉంటుందని ప్రముఖ రేటింగ్ సంస్థ కేర్ రేటింగ్స్ చెబుతోంది. పన్ను రహిత బాండ్‌ల జారీ చేయడం వల్ల కార్పొరేషన్లు, రిటైలర్లు పెట్టుబడులు పెట్టేందుకు అవకాశముంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశ వ్యాప్త లాక్‌డౌన్ కారణంగా కేంద్రానికి మార్చి నెలలో రూ. 28 వేల కోట్లు మాత్రమే జీఎస్టీ వసూళ్లు వచ్చాయి.

Tags : Coronavirus, Fiscal Gap, GST, Tax Free Bonds, Taxes



Next Story

Most Viewed